జయ ఆరోగ్యం: నాలుక కోస్తానని బెదిరించిన ఎంపీ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై పలు వందతులు వస్తున్న నేపథ్యంలో, ఆమె ఆరోగ్యం విషయమై ఎవరైనా మాట్లాడితే, వారి నాలుక కోస్తానని అన్నాడీఎంకే ఎంపీ పీ.ఆర్. సుందరం హెచ్చరించారు. నామక్కల్ జిల్లా, రాసిపురం కొత్త బస్టాండ్ వద్ద జయలలిత ప్రభుత్వ ప్రగతిని వివరిస్తూ ఓ బహిరంగ సభను నిర్వహించారు.
ఈ బహిరంగ సభలో రాష్ట్ర మంత్రి తంగమణి, నామక్కల్ ఎంపీ సుందరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో భూసేకరణ చట్టం ఆమోదం కోసం ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా జయలలిత మద్దతు కోరారని, అమ్మ మద్దతిస్తే చట్టం సులభంగా ఆమోదం పొందుతుందని అన్నారు.
జయలలితను విశ్రాంతి తీసుకోమని కొంతమంది అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిని ఊరికే వదలబోమని అన్నారు. 'అమ్మ' ఆరోగ్యంపై ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తామని బెదిరించారు. కొంతకాలంగా జయలలిత సచివాలయానికి రావడం లేదు. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా పోయెస్ గార్డెన్కే పరిమితమవుతున్నారు.
అందువల్ల ఆమె ఆరోగ్యం క్షీణించిందనే ప్రచారం జరుగుతోంది. మధుమేహంతో బాధపడుతున్నారని, చక్కెర శాతం ప్రమాదకరస్థాయిని దాటిందని, రక్తపోటూ ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి సోమవారం రాత్రి తన ట్విటర్ ఖాతాలో జయ ఆనారోగ్యంపై చేసిన ట్వీట్ రాజకీయ అలజడి సృష్టించింది.
ఇక తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలు ప్రచురించిన రెడిఫ్ వెబ్సైట్పై జయలలిత పరువునష్టం దావా వేశారు. ఈ నెల 10న జయ ఆరోగ్యం బాగాలేదని చెన్నై మీడియాకు తెలుసు.. కానీ, మౌనంగా ఉన్నాయి అని కథనం ప్రచురించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన జయ తన ఆరోగ్యంపై అసత్య కథనాన్ని ప్రచురించారని పేర్కొంటూ వెబ్సైట్పై పరువునష్టం దావా వేశారు.
ఈ నెల 10న కాలేయ మార్పిడి శస్త్రచికిత్స కోసం జయ అమెరికా వెళ్తున్నారని, ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వదంతులు వెలువడ్డాయి. అమెరికా వైద్యులు కొందరు ఇటీవల జయ నివాసానికి వచ్చారన్న వార్తలు వచ్చాయి.
జయ ఆరోగ్యంపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే, కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఆరోపణలను ఏఐఏడీఎంకే నేతలు కొట్టిపారేశారు. ఉప ఎన్నికల్లో చెన్నైలోని ఆర్కే నగర్ నుంచి శాసనసభ్యురాలిగా నెగ్గిన జయలలిత ఈ నెల 4న ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తానికి జయలలిత ఆరోగ్యంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.