ఆర్కేనగర్లో పన్నీర్ 108హామీలు: గెలిచేనా?, దేశంలోనే తొలిసారిగా ఇంకో కొత్త..
అన్నాడీఎంకె అభ్యర్థి దినకరన్ ను ఎట్టి పరిస్థితుల్లోను మట్టి కరిపించాలన్న ఉద్దేశంతో పన్నీర్ సెల్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
చెన్నై: ఆర్కేనగర్ ఉపఎన్నికలో గెలిచి జయలలితకు తామే అసలైన వారసులమని చాటుకోవాలని ఎవరికి వారు ఉవ్విళ్లురూతున్నారు. అన్నాడీఎంకె-పన్నీర్ సెల్వం వర్గం మధ్య ప్రధాన పోటీ నెలకొనగా.. బరిలో జయలలిత మేనకోడలు దీప కూడా నిలవడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు.
అన్నాడీఎంకె అభ్యర్థి దినకరన్ ను ఎట్టి పరిస్థితుల్లోను మట్టి కరిపించాలన్న ఉద్దేశంతో పన్నీర్ సెల్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆయన 108హామిల మేనిఫెస్టోను ఆయన తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటికే ప్రజల్లో కావాల్సినంత సానుభూతిని సంపాదించుకున్న పన్నీర్ సెల్వం.. మేనిఫెస్టోతో ప్రజలను ఆకట్టుకోగలిగితే ఈ ఎన్నికల్లో ఆయన వర్గానిదే విజయమని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే, దేశంలోనే తొలిసారిగా మొబైల్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని పన్నీర్ సెల్వం ప్రకటించడం విశేషం. ఇంతవరకు దేశంలో ఏ ఎమ్మెల్యే మొబైల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న దాఖలా లేదు. స్థానిక తండయారుపేటలోని పార్టీ కొత్త కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
కాగా, ఏప్రిల్ 12న జరగనున్న ఆర్కేనగర్ బై పోల్ ఫలితాలు, ఎన్నికలు జరిగిన మూడు రోజుల తర్వాత విడుదలవుతాయి. ఆర్కేనగర్ నియోజకవర్గం జయలలిత ఖాళీ చేసిన స్థానం కావడంతో.. ఎలాగైనా ఇక్కడ సత్తా చాటాలనేది ఆయా పార్టీల, వ్యక్తుల ప్రధాన ధ్యేయం.