గవర్నర్తో పళనిస్వామి కోసం తంబీదురై: విద్యాసాగర రావు ఏం చేస్తారు?
అన్నాడీఎంకేలోని రెండు వర్గాల అంశం రాజ్ భవన్ చేరుకున్నది! గురువారం నాడు మంత్రి జయకుమార్, మరో సీనియర్ నేత తంబీదురై గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు. దీంతో తమిళ రాజకీయాల్లో..
చెన్నై: అన్నాడీఎంకేలోని రెండు వర్గాల అంశం రాజ్ భవన్ చేరుకున్నది! గురువారం నాడు మంత్రి జయకుమార్, మరో సీనియర్ నేత తంబీదురై గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు. దీంతో తమిళ రాజకీయాల్లో.. ముఖ్యంగా అన్నాడీఎంకేలో ఏం జరుగుతుందోననే చర్చ సాగుతోంది.
కొత్త ట్విస్ట్: తమిళనాడు సీఎంగా పన్నీరుసెల్వం, పళనికి డిప్యూటీ..?
ఇప్పటికే చెన్నైలో, తమిళనాట అధికార మార్పిడి ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే పళనిస్వామి - పన్నీరుసెల్వం వర్గాల మధ్య విలీన చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో రాజ్ భవన్లో నేతలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అధికార మార్పిడి కోసం ఏమైనా చర్చ జరుగుతోందా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం పన్నీరుసెల్వం ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్న విషయం తెలిసిందే.
సీఎం పోస్ట్పై తర్జన
ముఖ్యమంత్రి పోస్ట్ పైన ప్రధానంగా పన్నీరుసెల్వం వర్గం, పళనిస్వామి వర్గం మధ్య చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో తంబిదురై, మంత్రి జయకుమార్ గవర్నర్ను కలవడంపై చర్చ జరిగింది. దీనిపై తంబీదురై మాట్లాడుతూ.. ఇది కేవలం ఫ్రెండ్లీ విజిట్ మాత్రమేనని చెప్పారు.
పళనిస్వామి కోసం పట్టు
అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిన తర్వాత తంబీదురై చిన్నమ్మ శశికళ వర్గం వైపు ఉన్నారు. పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ఉంచాలని ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం పదవి కోసం పన్నీరు పట్టుబడుతున్న నేపథ్యంలో పళనినే ఉంచాలని ఆయన కోరుకుంటున్నారు.
సీఎం మార్పు ప్రశ్నే ఉత్పన్నం కావొద్దు
బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ కూడా తంబీదురై ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. పళనిస్వామి సీఎంగా ఉండాలన్నారు. పళనిస్వామికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని, అందుకే ఆయన సీఎం అయ్యారని, విశ్వాస తీర్మానం సమయంలోను వారంతా ఓటు వేశారని, కాబట్టి ముఖ్యమంత్రి మార్పు అనే అంశం సరికాదని, ఆ ప్రశ్నే ఉత్పన్నం కావొద్దని చెబుతున్నారు.
రాజకీయాలు మాట్లాడలేదు
గవర్నర్ విద్యాసాగర రావుతో భేటీ అనంతరం తంబీదురై మాట్లాడారు. గవర్నర్తో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని తేల్చి చెప్పారు. కాగా, గతంలో ఫ్లోర్ టెస్ట్ సమయంలో గవర్నర్ పైన విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే.
శశికళను బయటకు పంపినా సస్పెన్స్
అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఇప్పుడు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే కొన్ని షరతుల కారణంగా విలీన ప్రక్రియ సస్పెన్స్గా మారింది. ఇరువర్గాలు సీఎం పోస్ట్ కోసం పట్టుబడుతున్న నేపథ్యంలో.. శశికళను, దినకరన్లను బయటకు పంపించినప్పటికీ విలీన ప్రక్రియ అంత సులభంగా జరిగేలా కనిపించడం లేదు.