పార్టీ పదవికి శశికళ రాజీనామా! పన్నీర్ సెల్వం వర్గం ఒత్తిడితో భారీ దెబ్బ!
పన్నీర్ సెల్వం వర్గం పట్టుబట్టడంతో ఎడప్పాడి పళనిసామి వర్గం జైల్లో ఉన్న శశికళ మీద ఒత్తిడి తీసుకురావడంతో అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చెయ్యడానికి ఆమె అంగీకరించారని సమా
బెంగళూరు/చెన్నై: అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు రాజీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వం, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గం ఒక్కటి కావడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.
అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, దినకరన్ ను బహిష్కరించామని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంలోని మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. తాను పార్టీకి దూరంగా ఉంటానని టీటీవీ దినకరన్ ప్రకటించారు. అయితే పన్నీర్ సెల్వం వర్గం మాత్రం వారి దగ్గర రాజీనామా లేఖలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు.
శశికళతో మంతనాలు
శశికళ, దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాలని పన్నీర్ సెల్వం వర్గం తేల్చి చెప్పింది. అప్పుడే తాము రాజీ గురించి ఆలోచిస్తామని, విలీనం విషయం మాట్లాడుదాం అని భీష్మించడంతో ఎడప్పాడి పళనిసామి వర్గం ఓ మెట్టుదిగి శశికళతో మంతనాలు జరుపుతున్నారు.
గత్యంతరం లేకనే ఇంత కాలం
గత్యంతరం లేకనే ఇంత కాలం శశికళ మాటలు వింటున్న ఆమె వర్గంలోని నాయకులు ఇప్పుడు చిన్నమ్మతోనే రాజీనామా చేయించే పనిలో ఉన్నారు. రెండు వర్గాలు కలిసిపోయిన తరువాత శశికళ గురించి ఆలోచిద్దాం అని నిర్ణయించారని తెలిసింది.
శశికళ రాజీనామా చేస్తేనే
శశికళ రాజీనామా లేఖ తాము చూసిన తరువాతే అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాల విలీనం విషయంలో చర్చలకు వస్తామని పన్నీర్ సెల్వం చెప్పడంతో ఎడప్పాడి పళనిసామి వర్గం ఆలోచనలో పడింది. ఎలాగైనా శశికళతో రాజీనామా చేయించాలని పలువురు సీనియర్ నేతలు పట్టుబడుతున్నారని సమాచారం.
రాజీనామాకు ఓకే చెప్పిన చిన్నమ్మ !
విశ్వసనీయ సమాచారం మేరకు అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చెయ్యడానికి శశికళ అంగీకరించారని ఆపార్టీ నాయకులే అంటున్నారు. అన్నాడీఎంకే పార్టీ భవిష్యత్తు కోసం శశికళ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
నాలుగేళ్లు జైల్లో ఉంటే పార్టీ భవిష్యత్తు ఏమిటి ?
శశికళ అన్నాడీఎంకే పార్టీ పదవిలో కొనసాగుతూ నాలుగేళ్లు జైల్లో ఉంటే పార్టీ భవిష్యత్తు ప్రశ్నర్థకంగా మారుతుందని ఇప్పుడు ఆమె వర్గంలోని నాయకులు అంటున్నారు. శశికళ దగ్గర రాజీనామా చెయ్యించడం ఎందుకైనా మంచిదని నిర్ణయించారని తెలిసింది.
మన్నార్ గుడి మాఫియా కోసమేనా ?
మన్నార్ గుడి మాఫియాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలనే శశికళ తన పదవికి రాజీనామా చెయ్యడానికి సిద్దం అయ్యారని సమాచారం. జైల్లో ఉన్న శశికళకు ఇప్పుడు ఆ పదవి ఉంటే ఏం ప్రయోజనం అని కొందరు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారని తెలిసింది.
ఇబ్బందులు వస్తే వారి పరిస్థితి ఏమిటి
శశికళ పార్టీ పదవి కావాలని పట్టుబడితే అనేక వ్యాపారాలు చేస్తున్న శశికళ కుటుంబ సభ్యులకు మరన్ని ఇబ్బందులు తప్పవని అన్నాడీఎంకే నాయకులు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద అన్ని వైపులా ఆలోచించి శశికళ రాజీనామా చెయ్యడానికి అంగీకరించారని ఆమె వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ నేతలు అంటున్నారు.