ఢిల్లీలో పొలాల్లో కూలిన ఎయిర్ అంబులెన్స్
న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలో ఎయిర్ అంబులెన్స్ కు ప్రమాదం జరిగింది. బీహార్ లోని పాట్నా నుంచి ఢిల్లీ వెలుతున్న ఎయిర్ అంబులెన్స్ పొలాల్లో అత్యవసరంగా దిగడానికి ప్రయత్నించి కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఎయిర్ బస్సులో మొత్తంలో ఏడు మంది ప్రయాణిస్తున్నారు. అందులో ఇద్దరికి గాయాలైనాయి. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలైన వారిని ప్రత్యేక అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
అల్ కెమిస్ట్ పార్మా కంపెనీకి చెందిన సీ- 90 అనే విమానంలో పాట్నా నుంచి ఓ రోగిని తీసుకుని ఢిల్లీకి బయలుదేరారు. మార్గం మధ్యలో ఇంజన్లలో సాంకేతిక లోపం వచ్చింది. వెంటనే ఎయిర్ అంబులెన్స్ ను కిందకు దించడానికి పైలెట్ ప్రయత్నించారు.
ఢిల్లీలోని నజఫ్ గఢ్ ప్రాంతంలో పొలాల్లో దించేశారని, ఆ సందర్బంలో అది కూలిపోయినంత పని అయ్యిందని అధికారులు అన్నారు. అయితే ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు అంటున్నారు. పొలాల్లో ల్యాండ్ అయ్యిందా ? అది కుప్పకూలిపోయిందా ? అనే విషయం దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.