షాక్: ఎయిరిండియాకు వ్యతిరేకంగా మాట్లాడితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కట్
ఎయిరిండియాలో వాటాలను విక్రయించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరుణంలోనే మరో కీలకమైన ఆదేశాలను ఎయిరిండియా జారీ చేసింది.
న్యూఢిల్లీ: ఎయిరిండియాలో వాటాలను విక్రయించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరుణంలోనే మరో కీలకమైన ఆదేశాలను ఎయిరిండియా జారీ చేసింది.
ఎయిరిండియా విక్రయానికి శరవేగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో మాజీ ఉద్యోగులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. సోషల్ మీడియాలో మాట్లాడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది.
సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే రిటైర్మెంట్ లాభాలను ఉపసంహరించుకోవడం వంటి భారీ పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ఉద్యోగులకు ఓ సర్క్యులర్ ను జారీ చేసింది. ఎయిర్ లైన్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడు సంఘాలు ఉద్యమానికి సిద్దపడుతున్నాయి. అలాంటి ఉద్యోగులు రిటైర్మెంట్ లాభాలను కోల్పోతారని హెచ్చరించింది.
సంస్థకు చెందిన మాజీ ఉద్యోగులు , ఎయిరిండియా ప్రతిష్టకు భంగకరంగా వ్యవహరిస్తున్నారని, దీని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించింది. ఎయిరిండియాపై ట్విట్టర్,ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్లలో ప్రతికూల వ్యాఖ్యలు చేసే మాజీ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం సౌకర్యాలను కోల్పోతారని తెలిపింది.
ఎయిరిండియా ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్, ఆశ్వనీ లోహని సంతకంతో జూన్ 21న, అంతర్గత ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహకరణకు కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇటు దేశీయ అతి పెద్ద ఎయిర్ లైన్స్ ఇండిగో ...ఎయిరిండియాలో వాటాల కొనుగోలుకు ఆసక్తిని కనబరుస్తూ లేఖ రాసింది. ఎయిరిండియాలో 30 ఏళ్ళ సర్వీస్ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన ఓ ఉద్యోగి 24 ఉచిత విమాన టిక్కెట్లను పొందవచ్చు.
వీటిలో 25 శాతం అంతర్జాతీయ ప్రయాణానికి కూడ ఉపయోగించుకోవచ్చు. వీరికి ఉచిత విమాన ప్రయాణంతో పాటు మెడికల్ ప్యాకేజీ తదితర సదుపాయాలు కూడ ఉంటాయి.