జయలలిత కోసం అజిత్ రాక: వచ్చే ఎన్నికల నాటికి పార్టీని లీడ్ చేసేనా?
చెన్నై: ప్రముఖ సినీ నటుడు అజిత్ అంటే దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అమిత వాత్సల్యం. జయలలిత కన్నుమూసిన విషయం తెలిసిన అజిత్ బల్గేరియా నుంచి బుధవారం నాడు వచ్చారు. ఆమెకు నివాళులు అర్పించారు.
తలా 57వ సినిమా షూటింగ్ కోసం అజిత్ బల్గేరియా వెళ్లారు. అమ్మ మృతి తెలిసి, ఆమెకు నివాళులు అర్పించేందుకు చెన్నై బయలుదేరి వచ్చారు. బుధవారం ఉదయం చెన్నై విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తన భార్య షాలినితో కలిసి జయలలిత సమాధి వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు.
నివాళి
తొలుత జయలలితకు నివాళులు అర్పించిన అజిత్, ఆ తర్వాత మరో తమిళ ప్రముఖులు చో రామస్వామి మరణ వార్త తెలుసుకొని ఆయనకు కూడా నివాళులు అర్పించారు. అనంతరం అజిత్ సినిమా షూటింగ్ కోసం బల్గేరియా బయలుదేరనున్నారని తెలుస్తోంది.
వారసుడేనా?
కాగా, పురుచ్చి తలైవి జయలలిత వారసుడిగా అజిత్ అంటూ తమిళనాట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి అజిత్ను రాజకీయాల్లో ముఖ్యమంత్రి పోటీదారుగా నిలబెట్టాలని జయలలిత కోరుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.. వస్తున్నాయి.
వీలునామా రాశారని ప్రచారం
జయలలిత ముందే తన వారసుడిని ఎంపిక చేసుకుందనే ప్రచారం కూడా ఉంది. తన వీలునామాలో అజిత్ను తన వారసుడని రాసుకున్నట్లు చెబుతుంటారు. అమ్మకు నమ్మిన బంటు దగ్గర ఆ వీలునామా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు పన్నీరు సెల్వం అయినా..
ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం బాధ్యతలు స్వీకరించినా రానున్న ఎన్నికల్లో పార్టీని లీడ్ చేసేది మాత్రం అజితేనని అంటున్నారు. అజిత్కు ప్రజాకర్షణ కూడా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయననే పార్టీని లీడ్ చేసినా చేయవచ్చునని అంటున్నారు.