దాద్రీ బాధితుని కుటుంబానికి రూ.45 లక్షల పరిహారం
లక్నో: ఆవును వధించి, మాంసాన్ని తిన్నారనే కారణంతో గ్రామస్తుల చేతిలో దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన బాధితుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే పరిహారాన్ని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.
ఆదివారం ఆయన లక్నోలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని సోదరులు ముగ్గురికి రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. ఇల్లు, రక్షణ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం సహా అన్ని రకాలుగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. దీనిపై బాధితుని కుటుంబం సంతృప్తి వ్యక్తం చేసింది.
హజ్ విషాదంలో 58కి చేరిన మృతులు
ఢిల్లీ: హజ్ యాత్రలో జరిగిన భారీ తొక్కిసలాటలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 58కి చేరింది. మరో 78 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సంబంధిత వివరాలను ఆదివారం వెల్లడించారు.
గల్లంతయిన ప్రజల ఆచూకీ కనిపెట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. సౌదీ అధికారుల వివరాల ప్రకారం.. హజ్ యాత్రలో గత నెలలో జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 769 మంది యాత్రికులు మృతి చెందారు. కాగా, ఈ దుర్ఘటనలో 1,036 మంది మరణించినట్లు విదేశీ అధికారులు, సమాచార మాధ్యమ సంస్థలు పేర్కొన్నాయి.