అందుకు నాతో 15 రోజులు మాట్లాడలేదు: అఖిలేష్పై ములాయం సంచలనం
ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అఖిలేష్కు ఈసీ సైకిల్ గుర్తు కేటాయించడం.. యూపీలో, ముఖ్యమంగా ఎస్పీలోఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి.
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అఖిలేష్కు ఈసీ సైకిల్ గుర్తు కేటాయించడం.. యూపీలో, ముఖ్యమంగా ఎస్పీలోఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో అఖిలేష్ పైన ములాయం సంచలన వ్యాఖ్యలు చేశారు.
'సైకిల్' చిక్కుముడి వీడింది
ఎస్పీలో నెలకొన్న సైకిల్ చిక్కుముడి వీడింది. సంక్షోభం మరింత ముదిరింది. పార్టీ గుర్తు సైకిల్ యూపీ సీఎం అఖిలేశ్కే చెందుతుందని ఈసీ స్పష్టం చేసింది. పార్టీ అధ్యక్షులప కూడా ఆయననే ఈసీ పేర్కొంది. అంతకుముందు పార్టీలో ఏర్పడిన విభేదాల కారణంగా తండ్రీకొడుకులిద్దరూ పార్టీ గుర్తు విషయంలో ఈసీ తలపుతట్టిన విషయం తెలిసిందే. ఇది ములాయంకు పెద్ద షాక్.
ఆ పోరు పార్టీ చీలిక దాకా..
బాబాయ్ (శివపాల్ యాదవ్), అబ్బాయ్ల (అఖిలేష్) మధ్య మొదలైన పోరు చివరికి పార్టీ చీలికకు దారి తీసింది. ఎన్నికల అభ్యర్థుల ప్రకటన విషయంలో తలెత్తిన అభిప్రాయ భేదాలు చిలిచిలికి గాలివానలా మారాయి. శివ్పాల్ యాదవ్ ప్రకటించిన పేర్లను పక్కకు పెట్టి అఖిలేశ్ మరికొన్ని పేర్లను సూచించడంతో వివాదం ప్రారంభమైంది.
ములాయంను పక్కన పెట్టి అఖిలేష్కు..
పార్టీ క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించారన్న కారణంతో పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్.. అఖిలేశ్, రాంగోపాల్ యాదవ్ పైన వేటు వేశారు. పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు. ఆ తర్వాత అఖిలేశ్పై బహిష్కరణ ఎత్తివేశారు. ఆ తర్వాత జనవరి 1న లక్నోలో అఖిలేశ్ మద్దతుదారులు ఎస్పీ జాతీయ సదస్సును ఏర్పాటు చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్ను ఎన్నుకున్నారు. ములాయంను పదవీచ్యుతుడిని చేశారు.
అజాం ఖాన్ మధ్యవర్తిత్వం
ములాయం - అఖిలేష్ల మధ్యసయోధ్య కుదిర్చేందుకు అజాం ఖాన్ వంటి నేతలు ప్రయత్నించారు. సయోధ్య కుదిరినట్లే కనిపించినా ఆ తర్వాత మళ్లీ మొదటికే వచ్చింది. ఎవరు బెట్టు వీడలేదు. దీంతో ఇరు వర్గాలు సైకిల్ కేటాయింపుపై ఎన్నికల కమిషన్ను ఆశ్రయించాయి. దీంతో తొలుత పార్టీ గుర్తును స్తంభింపజేయాలని యోచించిన ఈసీ చివరికి అఖిలేష్కే పార్టీ గుర్తును కేటాయించి ములాయంకు షాకిచ్చింది. తద్వారా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ వర్గం సైకిల్ గుర్తుతో పోటీ చేయనుంది.
పూర్తి మద్దతు అఖిలేష్కే ఉంది
ఎస్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జాతీయ కార్యవర్గ సభ్యులు, జాతీయ సమ్మేళనం ప్రతినిధులమందరి మద్దతు అఖిలేశ్కే ఉందని గణాంకాలు చెబుతున్నట్లు ఈసీ పేర్కొంది. పార్టీలోనూ, శాసనకర్తల పరంగానూ ఎక్కువ మంది ఆయనతోనే ఉన్నారనీ, విభజన స్పష్టంగా ఉందనీ తేల్చింది. 5731 మందిలో 4400 మంది తనతో ఉన్నట్లు అఖిలేశ్ దాఖలు చేసిన ప్రమాణపత్రాలతో ఈసీ ఏకీభవించింది. వీటిపై ములాయం వర్గం చేసిన ఆరోపణల్ని కొట్టి వేసింది. ఎన్ని అవకాశాలిచ్చినా ములాయం ఇలాంటివి సమర్పించనేలేదని తెలిపింది.
ములాయం ఆశీస్సుల కోసం వెళ్లిన అఖిలేష్
ఈసీ నిర్ణయం గురించి తెలియగానే అఖిలేష్ నివాసం వెలుపల కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈసీ నిర్ణయం తర్వాత అఖిలేశ్ తన తండ్రి ములాయం వద్దకు ఆశీస్సుల నిమిత్తం వెళ్లారు. ములాయంని పార్టీ అధ్యక్షునిగా పేర్కొంటూ ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఉన్న నామఫలకం కిందనే అఖిలేశ్ యాదవ్ పేరు, ఆ హోదా రాసిన సరికొత్త ఫలకాన్ని సోమవారం ఉదయమే చేర్చారు.
25ఏళ్ల తర్వాత ములాయంకు కొడుకే షాకిచ్చారు
ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షునిగా సైకిల్ గుర్తుతో ములాయం సింగ్కు పాతిక ఏళ్లుగా ఉన్న అనుబంధం తెగిపోయింది. ఈసీ నిర్ణయంతో ఆయన ఈ గుర్తును తనయునికి వదిలేయాల్సి వచ్చింది. నవంబరు 5నే పార్టీ రజతోత్సవాలను నిర్వహించగా ఆ తర్వాత పరిణామాలు చకచకా మారిపోయాయి. దేశంలో ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్పీ పోటీ చేసినా విజయం మాత్రం ప్రధానంగా యూపీ వరకే పరిమితమయింది. 2012 ఎన్నికల్లో విజయం తర్వాత ములాయం సీఎంగా పగ్గాలు చేపట్టకుండా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ తనయుడు అఖిలేశ్ని ఆ పదవికి ప్రతిపాదించారు.
నేను షాజహాను.. అఖిలేష్ ఔరంగజేబు
పార్టీ కార్యకర్తల భేటీలో ములాయం తను షాజహానుగాను, అఖిలేష్ను ఔరంగేజేబుగాను అభివర్ణించారు.
అఖిలేష్కు అర్థం కావట్లేదు
తాను చెప్పినట్లు అఖిలేశ్ వినకుంటే అతని పైన పోటీ చేస్తానని ములాయం ప్రకటించారు. నేను ముస్లింల కోసం జీవిస్తానని, వారి కోసం మరణిస్తానని, ముస్లింల ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి నేను అఖిలేశ్తోనూ పోరాడుతానని ములాయం చెప్పారు. పార్టీని రక్షించే ప్రయత్నాలన్నీ తాను చేస్తున్నాననీ, అఖిలేశ్కు కొన్ని విషయాలు అర్థం కావడం లేదన్నారు.
అఖిలేష్ పైన ములాయం సంచలన ఆరోపణలు
తాను ఎప్పుడూ ముస్లింల ప్రయోజనాలను పరిరక్షించడానికి పాటుపడే వ్యక్తిని అని, తాను ఒక ముస్లింను రాష్ట్ర డీజీపీగా నియమించాలని ప్రయత్నించానని, దానిపై అఖిలేశ్ పదిహేను రోజుల పాటు తనతో మాట్లాడలేదని, ఓ ముస్లిం ఈ పోస్టులోకి రావడం అతనికి ఇష్టం లేదని, అది ఆయన ముస్లిం వ్యతిరేకి అనే సంకేతాన్ని పంపిందని ములాయం సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతను అడ్డుకునేందుకు నేనెంతగా ప్రయత్నించానో మీకు తెలియనిది కాదన్నారు.