లాటరీ స్కాం: సీఏటీని ఆశ్రయించనున్న ఐపీఎస్ అలోక్ కుమార్
బెంగళూరు: వేల కోట్ల రూపాయాల సింగిల్ నెంబర్ లాటరీ స్కాం కేసులో ఆరోపణలు రావడంతో సస్పెండైన సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ సెంట్రల్ అడ్మినిస్టేటివ్ ట్రిబునల్ (సీఏటీ)ని ఆశ్రయించాలని రంగం సిద్దం చేసుకుంటున్నారు.
లాటరీ స్కాం కేసు దర్యాప్తు చేసిన సీఐడి అధికారులు ఈ కేసులో కింగ్ పిన్ పారి రాజన్ తో నిత్యం అలోక్ కుమార్ టచ్ లో ఉన్నారని, అతని అక్రమ దందాకు సహకరించాడని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. బెంగళూరు నగర జాయింట్ పోలీసు కమిషనర్ గా పని చేస్తున్న అలోక్ కుమార్ ను మే 23వ తేది సస్పెండ్ చేశారు.
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ అలోక్ కుమార్ సీఏటీలో అర్జీ సమర్పించాలని నిర్ణయించారు. బుధ, గురువారాలలో అలోక్ కుమార్ ఇదే విషయంపై ఆయన న్యాయవాదులతో చర్చించారు. ఇంకా రెండు రోజుల పాటు సీఐడీ అధికారులు అలోక్ కుమార్ ను ప్రశ్నించనున్నారు.
ఇప్పటికే ఈ సింగిల్ నెంబర్ లాటరీ స్కాం కేసు సీబీఐకి అప్పగిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. అయితే కర్ణాటక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి సీబీఐకి అధికారికంగా ఆదేశాలు అందడానికి సమయం పడుతుందని తెలిసింది. అప్పటి వరకు సీఐడి అధికారులు దర్యాప్తు చేస్తారు.