మోడీకి, సైన్యానికి అమిత్ షా కంగ్రాట్స్: పాక్కు దెబ్బకు దెబ్బ, 38 మంది హతం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోడీకి, భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. జమ్ము కాశ్మీర్లోకి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటును కట్టడి చేసేందుకు ఎల్వోసీ వద్ద దాడులు కొనసాగుతున్నట్లు సైన్యం తెలిపింది.
యూరీ ఉగ్ర ఘటన అనంతరం పాక్ పైన భారత్ చేపట్టిన తొలి భారీ సర్జికల్ స్ట్రైక్ బుధవారం అర్ధరాత్రి పన్నెండున్నర గంటల నుంచి తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు సాగింది. ఈ నేపథ్యంలో అమిత్ షా.. ప్రధాన మోడీకి, సైన్యానికి కంగ్రాట్స్ చెప్పారు. ఆయన ట్విట్టర్ ద్వారా కంగ్రాట్స్ తెలిపారు.
పాకిస్తాన్కు దెబ్బకు దెబ్బ: ఎయిర్ చీఫ్ మార్షల్స్ (రిటైర్డ్) బీకే పాండే
పాకిస్తాన్ను దెబ్బకు దెబ్బ కొట్టామని ఎయిర్ చీఫ్ మార్షల్స్ (రిటైర్డ్) బీకే పాండే అన్నారు. ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఎదురు దెబ్బ కొట్టారని అభిప్రాయపడ్డారు.
38 మంది ఉగ్రవాదుల హతం, ఏడుగురిని బంధించారు
ఎల్వోసీ వద్ద 500 మీటర్ల నుంచి కిలో మీటర్ వరకు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. ఏడు టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ను తుదముట్టించినట్లు చెప్పారు. ఈ దాడిలో మన సైన్యం 38 మందిని తుదముట్టించింది. ఏడుగురిని బంధించారు.
యూరి దాడి ఘటన నేపథ్యంలో జరిగిన దర్యాప్తులో పట్టుబడ్డ అనుమానిత ఉగ్రవాదులు పాకిస్థాన్లో శిక్షణ పొందినట్లు వెల్లడించారని, ఉగ్రవాదుల వద్ద ఉన్న జీపీఎస్ కూడా వారు పాక్ నుంచే వచ్చినట్లు చూపించిందని డీజీఎంవో రణ్బీర్ సింగ్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో సరిహద్దులో ఉగ్రవాద స్థావరాలపై తాము దాడులు చేసినట్లు తెలిపారు. పాక్ వైపు నుంచి 20 చొరబాట్లు అడ్డుకున్నట్లు చెప్పారు. పీవోకేలో ఉగ్రవాదుల పైన దాడులు మొదలయ్యాయన్నారు. మెట్రో నగరాలపై దాడులకు కుట్ర పన్నారని చెప్పారు.