మోడీ విందుకు శివసేన మంత్రి, అందుకే వచ్చా: గీతే
న్యూఢిల్లీ: దీపావళి పర్వదినం నేపథ్యంలో సోమవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులకు విందు ఇచ్చారు. ఈ విందుకు శివసేనకు చెందిన కేంద్ర మంత్రి అనంత్ గీతే హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహారాష్ట్ర ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేన బంధం తెగిపోయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి అనంత్ గీతే రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీతో పొత్తుకు పెట్టుకోవడానికి శివసేన, ఎన్సీపీ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ సమయంలో మోడీ ఇచ్చిన విందుకు అనంత్ గీతే హాజరు కావడం గమనార్హం.
అయితే, కేంద్రంలో బీజేపీ- శివసేన పొత్తు కొనసాగుతోందని, దానికితోడు తాను కేంద్ర మంత్రినని, అందుకే విందుకు హాజరయ్యానని అనంతం గీతే తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలచాలని, తాను ఇచ్చిన పిలుపును క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలని మంత్రులను మోడీ కోరారు. మోడీ విందుకు 44 మంది కేంద్రమంత్రులు హాజరయ్యారు.
బయటనుంచే: శరద్ పవార్
మహారాష్ట్రలో బీజేపీకి బయటనుంచి మద్దతునిస్తేనే సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. కొత్త ఎమ్మెల్యేలతో సోమవారం ఆయన మాట్లాడారు. బయటనుంచి మద్దతివ్వడమే ఉత్తమమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ఎన్సీఎల్పీ నేతగా ఎన్నికైన అజిత్పవార్ మీడియాతో మాట్లాడారు. శివసేనతో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటూ ఓ కాంగ్రెస్ నేత తమను సంప్రదించారన్నారు. అయితే దానివల్ల ప్రభుత్వం సుస్థిరంగా ఉండదని, అందుకే తిరస్కరించామని చెప్పారు. ఎన్సీపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే సుస్థిరత సాధ్యమన్నారు.
బీజేపీ ప్రతిపాదిస్తే సమ్మతమే: శివసేన
బీజేపీతో కలవడంపై శివసేన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మోడీపై విమర్శలు కురిపిస్తూనే బీజేపీ నుంచి ఏ ప్రతిపాదన వచ్చినా అంగీకరిస్తామని చెబుతోంది. బీజేపీతో చర్చి స్తున్నామని శివసేన నేత అనిల్ దేశాయ్ అన్నారు. తమ రెండు పార్టీలకు ప్రజల తీర్పు అనుకూలమని, సుస్థిర ప్రభుత్వా న్ని వారు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. శివసేన బీజేపీకి ఎటువంటి షరతులు విధించలేదని స్పష్టం చేశారు. అంతకుముందు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్యేలతో సమావేశమైన విషయం తెలిసిందే.