మద్యం మత్తులో వేదింపులు: తల పచ్చడి, నిప్పంటించిన భార్య
బెంగళూరు: నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ సహనం కోల్పోయిన భార్య భర్తను అతిదారుణంగా హత్య చేసిన సంఘటన బెంగళూరు నగరంలోని రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన విజయ్ కుమార్ అలియాస్ విజయ్ (45) అనే వ్యక్తి హత్యకు గురైనాడు.
విజయ్ ని హత్య చేసిన అతని భార్య మల్లేశ్వరి ఆంధ్రప్రదేశ్ కు పరారైయ్యిందని శుక్రవారం పోలీసులు చెప్పారు. అనంతపురం జిల్లా నుండి బెంగళూరు చేరుకున్నవిజయ్ కుమార్, మల్లేశ్వరి దంపతులు లగ్గేరెలోని సాయిబాబా దేవాలయం సమీపంలోని సర్వీసు రోడ్డులో నివాసం ఉంటున్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయ్ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతను నిత్యం మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్య, పిల్లలను వేదించేవాడని సమాచారం. ఈ విషయంలో నిత్యం దంపతుల మధ్య గొడవలు జరిగేవి.
గురువారం సాయంత్రం గొడవ జరగడంతో స్థానికులు ఇద్దరికి బుద్దిమాటలు చెప్పారు. శుక్రవారం వేకువ జామున 3 గంటల సమయంలో మళ్లి గొడవ జరిగింది .ఆ సందర్బంలో మల్లేశ్వరి బండరాయి తీసుకుని భర్త ముఖం మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసింది. అతను అక్కడే మరణించాడు.
విజయ్ ప్రాణాలు పోవడంతో ఇంటిలోని కిరోసిన్ తీసుకుని అతని మీద చల్లింది. తరువాత నిప్పంటించి పిల్లలను పిలుచుకుని అక్కడి నుండి పరారైయ్యింది. శుక్రవారం ఉదయం ఇంటి నుండి దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ 50 శాతం కాలిపోయాడు. కర్నూలు, అనంతపురం జిల్లాలలో మల్లేశ్వరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.