ప్రీతిపై యాసిడ్ దాడి, హత్య: దోషి పన్వర్కు ఉరిశిక్ష
ముంబై: లెఫ్ట్నెంట్ నర్స్ ప్రీతి రాఠి(23)పై యాసిడ్ దాడి చేసి ఆమె మరణానికి కారణమైన ఆమె పొరుగింటి వ్యక్తి అంకుర్ పన్వర్కు మరణశిక్ష విధించింది ముంబైలోని ప్రత్యేక కోర్టు. ఈ కేసులో అంకుర్ దోషి అని గత మంగళవారం కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
గురువారం కోర్టు తీర్పు వెలువడగానే అక్కడే ఉన్న ప్రీతి సోదరుడు హితేష్.. అంకుర్ పన్వర్పై దాడి చేశాడు. కాగా, ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా అంకుర్ ఈ దాడి చేశాడని, అందువల్ల అతనికి పెద్ద శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది. వారి వాదనకు అనుకూలంగానే ప్రత్యేక కోర్టు అంకుర్కు ఉరిశిక్ష విధించింది.
ప్రీతిది పరువు హత్యే: నిందితుడు పన్వర్, ఉరితీయాలన్న తండ్రి
మూడేళ్ల కిందట తన ఇంటి పక్కనే ఉండే ప్రీతి వెంట ఢిల్లీ నుంచి ముంబై వరకు వెళ్లాడు అంకుర్. తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందన్న అక్కసు, తన ఉద్యోగం రాకముందే తనకు వచ్చిందన్న అసూయతో ముంబై చేరగానే బాంద్రా స్టేషన్ బయట ఆమెపై యాసిడ్ దాడి చేశాడు
దీంతో తీవ్ర గాయాలపాలైన ప్రీతి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నెల రోజుల తర్వాత మరణించింది. పన్వర్ యాసిడ్ దాడి చేసిన సమయంలో ప్రీతి తండ్రి అమర్ సింగ్ రాఠి కూడా ఆమె పక్కనే ఉన్నారు. అతనిపైన కూడా యాసిడ్ పడటంతో అతని చేయి కాలిపోయింది. ఈ ఘటన 2013లో చోటు చేసుకుంది. కాగా, కోర్టు తీర్పు పట్ల ప్రీతి కుటుంబసభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.