అల్పపీడనం: ఆంధ్రకు మరో తుఫాను ముప్పు
విశాఖపట్నం: బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగున్ను అల్పపీడనద్రోణి ప్రభావంతో నవంబర్ 2 నాటికి ఆగ్నేయ, దక్షిణ బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది.
అల్పపీడనం బలపడి వాయుగుండంగా తీరం దాటుతుందా?లేదా తుఫాన్గా మారుతుందా? అనే విషయం మరో రెండు రోజులు ఆగితే గానీ కచ్చితంగా చెప్పలేమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక, అరేబియా సముద్రంలో ఏర్పడ్డ నిలోఫర్ పెనుతుఫాన్ బలహీనపడింది. గురువారం నాటికి తుఫాన్గా మారి ఈశాన్య అరేబియా సముద్రంలో స్థిరంగా కొనసాగుతోంది.
ఇది శుక్రవారం నాటికి ఉత్తర గుజరాత్ తీరం దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కాగా, విశాఖ ఏజెన్సీ మంచు దుప్పట్లో మునగదీసుకుంది. నెమ్మదిగా చలిపులి విజృంభిస్తోంది. ఆంధ్రా ఊటీగా పేరొందిన లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం లంబసింగిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అదివారంనాటికి ఒడిషాలోని పరదీప్కు 520 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమవుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే 72 గంటల్లో అల్పపీడనం తుఫానుగా మారి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు ప్రాంతాలను తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. దాని ప్రభావంతో సోమవారంనాడు ఒడిషాలోని కోస్తా తీర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.