తక్కువ ధర ఐఫోన్ వచ్చేస్తోంది.. భారత్ లో తొలి మోడల్ ‘ఐఫోన్ ఎస్ఈ’
ఆపిల్ కంపెనీ త్వరలోనే భారత్ లో ఐఫోన్ల తయారీని ప్రారంభించనుంది. తొలుత తక్కువ ధర మోడల్ ‘ఐఫోన్ ఎస్ఈ’ని తయారు చేయాలని ఆపిల్ నిర్ణయించింది.
న్యూఢిల్లీ: ఆపిల్ కంపెనీ త్వరలోనే భారత్ లో ఐఫోన్ల తయారీని ప్రారంభించనుంది. బెంగళూరులోని తమ కాంట్రాక్ట్ సంస్థ, తైవాన్ కు చెందిన విస్ట్రన్ కార్పొరేషన్ సాయంతో ప్లాంట్ ను ఏర్పాటు చేసి ఫోన్ల తయారీ మొదలుపెట్టనుంది.
తొలుత తక్కువ ధర మోడల్ 'ఐఫోన్ ఎస్ఈ'ని తయారు చేయాలని ఆపిల్ నిర్ణయించినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఐఫోన్లను మరింత తక్కువ ధరకే విక్రయించాలన్న ఉద్దేశంతో ఇండియాలోనే తయారీ ప్రారంభించాలని ఆపిల్ నిర్ణయించింది.
ఈ మేరకు పన్ను రాయితీల కోసం కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తోంది. అయితే భారత్ లో తొలి ఐఫోన్ మోడల్ 'ఎస్ఈ'కి మాత్రం ఈ పన్ను రాయితీ ఉండదని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రారంభంలో 3 నుంచి 4 లక్షల యూనిట్ల ఐఫోన్ ఎస్ఈలను తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇంకా భారత్ లో ఏఏ మోడల్స్ ఆపిల్ కంపెనీ తయారు చేయబోతుందనే దానిపై స్పష్టత లేదు.
గత ఏడాది ఇండియాలో 25 లక్షల ఐఫోన్లను ఆపిల్ కంపెనీ విక్రయించింది. భారతదేశంలో ఓవరాల్ గా స్మార్ట్ ఫోన్ కేటగిరీలో ఆపిల్ పదో స్థానంలో ఉండగా.. ప్రీమియం ఫోన్ల కేటగిరీలో మాత్రం 62 శాతం వాటాతో ముందంజలో ఉంది.