భారత్ లో ఐఫోన్ తయారీ.. ఇంకెన్నాళ్లకో, జీఎస్టీ తరువాతైనా గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా?
భారత్ లో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని టెక్ దిగ్గజం ఆపిల్ రచిస్తున్న వ్యూహాలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి.
న్యూఢిల్లీ: భారత్ లో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని టెక్ దిగ్గజం ఆపిల్ రచిస్తున్న వ్యూహాలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇటీవలే ఆపిల్ డిమాండ్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించింది.
అనంతరం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కూడా జీఎస్టీ అమలు తరువాతే ఆపిల్ డిమాండ్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఆపిల్ కోరుతున్న పన్ను ప్రోత్సాహకాలను, ఇతర డిమాండ్లను ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న జీఎస్టీ తరువాతే పరిశీలిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టం చేశారు.
''జీఎస్టీ బిల్లు త్వరలోనే అమలులోకి వస్తుంది. ఆపిల్ కోరుతున్న పన్ను ప్రోత్సాహకాలను ఇక వేరే కోణంలో చూడాల్సి ఉంది..'' అని నిర్మలా సీతారామన్ సోమవారం పేర్కొన్నారు. ఐఫోన్ తయారీదారు ఆపిల్ అడిగే చాలా డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆమె తెలిపారు.
నిజానికి ఆపిల్ కంపెనీ ఐఫోన్ల తయారీ కేంద్రాన్ని ఈ ఏడాదే బెంగళూరులో ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసుకుంది. కానీ ఆపిల్ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు.
దీంతో ఆపిల్ చైనా, బ్రెజిల్ లో తన తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. పన్ను ప్రోత్సాహకాలతోపాటు తప్పనిసరిగి 30 శాతం స్థానిక వనరులే ఉండాలనే నిబంధన నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఆపిల్ భారత ప్రభుత్వాన్ని కోరుతోంది.
దేశంలో పూర్తిగా తన రిటైల్ అవుట్ లెట్స్ ను ప్రారంభించాలని కూడా ఆపిల్ ప్రణాళికలు వేసుకుంటోంది. ఐఫోన్ల తయారీకి ఆపిల్ తయారు చేసిన బ్లూప్రింట్ కు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు ఆపిల్ జనవరిలో సంకేతాలు ఇచ్చింది. కానీ తాజాగా ఆపిల్ కోరుతున్న డిమాండ్లను మాత్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించింది.