భారత్ మాతాకి జై అని చెప్పలేదని మీరు పాకిస్థానీలా ? అని మీడియాను ప్రశ్నించిన మంత్రి
బీజేపీ పార్టీ కార్యక్రమంలో భారత్ మాతాకి జై అని చెప్పని విలేకరులను మీరు పాకిస్థానీలు, పాక్ సానుభూతిపరులు అంటూ బీహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ (బీజేపీ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పాట్నా: బీజేపీ పార్టీ కార్యక్రమంలో భారత్ మాతాకి జై అని చెప్పని విలేకరులను మీరు పాకిస్థానీలు, పాక్ సానుభూతిపరులు అంటూ బీహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ (బీజేపీ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి వినోద్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలపై పెద్ద చర్చ జరుగుతోంది.
బీహార్ లో మంగళవారం సాయంత్రం బీజేపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అథితిగా ఆ రాష్ట్ర గనులు, జనవనరుల శాఖ మంత్రి వినోద్ కుమార్ సింగ్ హాజరైనారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆవేశంగా మాట్లాడిన మంత్రి వినోద్ కుమార్ సింగ్ చివరికి అందరూ చేతులు పైకి ఎత్తి భారత్ మాతాకి జై అని చెప్పండి అని సూచించారు.
మంత్రి కార్యక్రమానికి హాజరైన కొందరు విలేకరులు చేతులు పైకి ఎత్తి భారత్ మాతాకి జై అని చెప్పలేదని తెలిసింది. వెంటనే మంత్రి వినోద్ కుమార్ సింగ్ విలేకరుల వైపు చెయ్యి చూపిస్తూ మాట్లాడారు. ఇక్కడ ఉన్న కొందరు విలేకరులు భారత్ మాతాకి జై అని చెప్పలేదని తాను గుర్తించానని అన్నారు.
భారత్ మాతాకి జై అని చెప్పని మీరు పాకిస్థానీలా ? పాకిస్థాన్ కు మీరు మద్దతు ఇస్తున్నారా ? అని ప్రశ్నించారు. మొదట మీరు భరతమాత ముద్దుబిడ్డలు, తరువాత మీడియా మిత్రులు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని మంత్రి వినోద్ కుమార్ సింగ్ సూచించారు. ఈ విషయంపై పెద్ద చర్చకు దారి తియ్యడంతో బుధవారం మంత్రి వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, నేను మాట్లాడిన వీడియో చూస్తే మీకే అర్థం అవుతుందని మీడియాకే ఝలక్ ఇచ్చారు.