ఉగ్రవాదుల దాడి: ఆర్మీ అధికారి, ముగ్గురు పౌరుల మృతి
జమ్మూ కశ్మీర్ లోని ఆర్నియా సెక్టార్ లో ఉగ్రవాదులు గురువారం కాల్పులు జరిపారు. ఆర్మీ బంకర్లోకి చొరబడిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భారత జవాన్లు, ఉగ్రవాదుల మధ్య తుపాకుల మోత మోగుతోంది. ఈ ఉగ్రవాదులు బుధవారం రాత్రే బంకర్లలో చొరబడినట్లు అనుమానిస్తున్నారు.
నలుగురు ఉగ్రవాదులు ఆయుధాలతో సరిహద్దుల్లోకి చొరబడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇటీవల సరిహద్దుల్లో.. ఉగ్రవాదుల చొరబాట్లు పెరగడంతో.. సైన్యం అప్రమత్తమైంది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జూనియర్ కమిషన్డ్ అధికారితోపాటు ముగ్గురు పౌరులు మృతి చెందారు. కొందరు సైనికులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కాల్పుల ఘటనపై స్పందించిన జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. నేపాల్లో జరుగుతున్న సార్క్ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరైన నేపథ్యంలో ఈ ఘటన యాధృశ్చికంగా జరగలేదని అన్నారు. కాల్పుల్లో మృతి చెందిన జవాన్లకు ఒమర్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
కాగా, నవంబర్ నెలలో బడ్గావ్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో.. ఇద్దరు యువకులు మృతి చెందారు. సరిహద్దుల్లో నిబంధనలు ఉల్లంఘించి.. ఉగ్రవాదులు దాడులకు తెగబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజా ఘటనలతో.. ఉగ్రవాదుల కదలికలపై... ఆర్మీ వర్గాలు సమాచారం సేకరిస్తున్నాయి. ప్రత్యేకంగా చెక్ పాయింట్లు ఏర్పాటుచేసి భద్రతా చర్యలు సమీక్షిస్తున్నారు.