సెల్ఫ్ గోల్: ఆధారాలివిగో.. హంగామా చేసి అడ్డంగా బుక్కైన మమతా బెనర్జీ!
పశ్చిమ బెంగాల్లో టోల్ గేట్ల వద్ద కేంద్ర బలగాల మోహరింపు వ్యవహారంలో ముఖ్యమంత్రి, టీఎంసి అధినేత్రి మమతా బెనర్జీదే తప్పని ఆర్మీ నిరూపించింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో టోల్ గేట్ల వద్ద కేంద్ర బలగాల మోహరింపు వ్యవహారంలో ముఖ్యమంత్రి, టీఎంసి అధినేత్రి మమతా బెనర్జీదే తప్పని ఆర్మీ నిరూపించింది. తమకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బలగాలను తమ రాష్ట్రంలోకి పంపించడాన్ని వ్యతిరేకిస్తూ మమత ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
రూ.13వేల కోట్ల ఆస్తి ప్రకటించాడు, కానీ నిబంధనల ప్రకారం బ్లాక్ మనీ అయింది
దీంతో కేంద్ర బలగాలను పశ్చిమ బెంగాల్ నుంచి ఉపసంహరించారు. అయితే బెంగాల్ విభాగాల అభ్యర్థన మేరకే బలగాలను పంపించామని ఆర్మీ వెల్లడించింది. బెంగాల్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి తమకు అందిన నాలుగు లేఖలను ఆర్మీ విడుదల చేసింది.
బెంగాల్ జీఓవీసి చెందిన మేజర్ జనరల్ సునీల్ యాదవ్ ఈ లేఖలను విడుదల చేశారు. బెంగాల్ ప్రభుత్వ కార్యాలయాల నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నామని, ఆ తర్వాతే బలగాలను పంపించామని వెల్లడించారు.
నల్లధనం మిగలకపోవచ్చు!: మోడీ లెక్క తప్పిందా?
బెంగాల్కు కేంద్ర బలగాలను పంపడానికి వారం ముందే అనుమతులు పొందామని చెప్పారు. ఆర్మీ వివరణలతో మమతా బెనర్జీ కంగు తిన్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బలగాలను మోహరించారని మమతా బెనర్జీ హడావుడి చేసి, సెల్ఫ్ గోల్ చేసుకున్నారని అంటున్నారు.
తిప్పికొట్టిన ఆర్మీ
పశ్చిమ్బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సైన్యం నుంచి అనుకోని షాక్ తగిలింది. తమ అనుమతి లేకుండా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సైన్యాన్ని కేంద్రం మోహరించిందంటూ చేసిన ఆమె ఆరోపణలను సైన్యం తిప్పికొట్టింది. ప్రభుత్వ శాఖల అభ్యర్థన మేరకే తాము బలగాలను మోహరించామని, అందుకు వారం ముందే ఆయా విభాగాల నుంచి సంబంధిత అనుమతులు తీసుకున్నామని సైన్యం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి బెంగాల్ ప్రాంత అధికారి మేజర్ జనరల్ సునీల్ యాదవ్ మీడియాకు ఆధారాలతో కూడిన పత్రాలను విడుదల చేశారు.
మమత హంగామా
నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తాను పోరాడడాన్ని సహించలేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్దఎత్తున సైన్యాన్ని పంపించిందంటూ నిరసనగా ఆమె గురువారం రాత్రంతా సచివాలయంలో ఉండిపోయారు. టోల్ గేట్ల వద్ద తమ అనుమతి లేకుండా సైన్యాన్ని మోహరించడాన్ని ఆమె తప్పుబట్టారు. దీనిపై పార్లమెంట్ ఉభయ సభల్లోనూ శుక్రవారం పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో మమత చెప్పిన దాంట్లో వాస్తవం లేదని నిరూపిస్తూ సంబంధిత పత్రాలు విడుదల చేసి మమతను ఇరుకున పడేశాయి.
ఇంత దిగజారుతారా?
స్వలాభం కోసం సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగుతారా అంటూ మమతా బెనర్జీపై బీజేపీ మండిపడింది. దీనిపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో మమతపై విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం దాన్ని వ్యతిరేకిస్తున్న వర్గానికి మమత నాయకత్వం వహిస్తున్నారని, రాజకీయంగా ఎదిగేందుకు మమత చేస్తున్న ఈ ప్రయత్నాలను మేం తప్పుపట్టలేమని, కానీ నిబద్ధత కలిగిన ఆర్మీని ఇలా రాజకీయాల్లోకి లాగడం మాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
మమత క్షమాపణలు చెప్పాలి
ఇది మమతా బెనర్జీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. రాజకీయంగా సైన్యాన్ని వినియోగించుకోవాలన్న మమత దుర్బుద్ధిని ఆర్మీ ఆధారాలతో సహా బయటపెట్టిందని, సైన్యానికి వెంటనే ఆమె క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.