ఓటుకు నోటిస్తే.. అరెస్టే! ఈసీ ప్రతిపాదన, ఓకే చెప్పిన మెజారిటీ రాష్ట్రాలు
నోటిచ్చి ఓటు అడిగే రాజకీయ నాయకులను ముందు అరెస్టు చేసి, ఆ తరువాతే దర్యాప్తు జరపాలని దేశంలోని అత్యధిక రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి.
న్యూఢిల్లీ: నోటిచ్చి ఓటు అడిగే రాజకీయ నాయకులను ముందు అరెస్టు చేసి, ఆ తరువాతే దర్యాప్తు జరపాలని దేశంలోని అత్యధిక రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. ఎన్నికల్లో అవినీతిని అరికట్టే చర్యల్లో భాగంగా.. ఓటుకు నోటు సంస్కృతిని నియంత్రించాలన్న భారత ఎన్నికల సంఘం ఆలోచనలకు అసోం, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు తప్ప తక్కినవన్నీఆమోదం తెలిపాయి.
ఇప్పటి వరకూ ఎన్నికల్లో అవినీతికి పాల్పడినట్లు గట్టి రుజువు ఉంటేనే కేసు పెట్టి.. అరెస్టు చేస్తున్నారు. అదే పోల్ అవినీతిని కేసు పెట్టదగిన నేరాల పరిధిలోకి తీసుకొచ్చినట్లయితే.. వారెంటు లేకుండానే అరెస్టు చేసే అధికారం పోలీసులకు వస్తుంది.
అయితే దీనికోసం సీఆర్పీసీ, ఐపీసీలలో అవసరమైన సవరణలు తీసుకురావలసి ఉంటుంది. ఈ విషయమై 2012లో కేంద్ర హోంశాఖ ఎన్నికల సంఘంను సంప్రదించింది. ఎన్నికల సంఘం సూచనల మేరకు సీఆర్పీసీ(సవరణ) బిల్లును అప్పటి యూపీఏ ప్రభుత్వం తయారు కూడా చేసింది.
మెజారిటీ రాష్ట్రాలు ఈసీ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో జాతీయ ప్రధాన ఎన్నికల కమిషనర్ నజీమ్ జైదీ.. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. సవరణ బిల్లు ఆమోదానికి సంబంధించిన ప్రక్రియను వెంటనే చేపట్టాలంటూ గత ఏడాది డిసెంబరు 1న రాసిన లేఖలో కోరారు.
మరోవైపు.. డబ్బు ప్రభావం ఎన్నికలపై పడకుండా ఉండడం కోసం తనకు అదనపు అధికారాలను కల్పిస్తూ.. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు తీసుకురావాల్సిందిగా లా కమిషన్ ను.. ఎన్నికల సంఘం కోరుతోంది.