వారంట్ జారీ: వంద మంది పోలీసులతో కర్ణన్ ఇంటికి డిజిపి
వంద మంది పోలీసులను వెంటబెట్టుకుని పశ్చిమ బెంగాల్ డిజిపి పురాకాయస్థ కర్ణన్ నివాసానికి వెళ్లి వారంట్ జారీ చేశారు. సుప్రీం ఆదేశాల మేరకు ఈ వారంట్ను జారీ చేశారు.
కోల్కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్కు పశ్చిమ బెంగాల్ పోలీసు డైరెక్టర్ జనరల్ పురాకాయస్థ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేశారు. ఈ వారంట్ జారీ చేసేందుకు ఆయన వంద మంది పోలీసులను వెంటబెట్టుకుని కోల్కతాలోని కర్ణన్ ఇంటికి వెళ్లారు.
కోర్టు ధిక్కారం కేసులో విచారణకు హాజరు కానందున జస్టిస్ కర్ణన్కు సుప్రీంకోర్టు మార్చి 10వ తేదీన బెయిలబుల్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. బెంగాల్ పోలీస్ చీఫ్ వ్యక్తిగతంగా వెళ్లి వారంట్ జారీ చేయాలని సుప్రీం ఆదేశించింది.
న్యాయవ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ కర్ణన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహార్ సహా మరో ఆరుగురు న్యాయమూర్తులు ఆయనకు సమన్లు జారీ చేశారు. కోర్టు ధిక్కారం కింద పరిగణించి సుప్రీంకోర్టులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఫిబ్రవరిలో ఆదేశించారు.
అయితే కర్ణన్ మాత్రం గతంలో ఎవరూ స్పందించని రీతిలో స్పందించారు. అదేరోజు తన ఇంటి ఆవరణలోనే 'కోర్టు' ఏర్పాటు చేసి తనకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసిన ఏడుగురు సుప్రీంకోర్టు జడ్జిలపై విచారణ చేయాల్సిందిగా సీబీఐకి ఆదేశాలు జారీ చేశారు.
దాంతో సరిపెట్టకుండా తాజాగా తనను మనోవేదనకు గురిచేశారనీ, పరువుకు భంగం కలిగించారని పేర్కొంటూ సుప్రీంకోర్టు సీజే సహా మిగతా ఆరుగురు జడ్జిలు రూ.14 కోట్లు పరిహారం చెల్లించాలని ఓ లేఖాస్త్రాన్ని సంధించారు.
అరెస్టు వారంట్ జారీ చేసిన సమయంలో డిజిపి వెం కోల్కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్, డిఐజి (సిఐడి) రాజేష్ కుమార్ కూడా ఉన్నారు.