ఆర్టికల్ ‘370’ని ముట్టుకోలేరు: మెహబుబా, బిజెపి తగ్గిందనుకోలేమని..
ఢిల్లీ: జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణాన్ని ఎవరూ ముట్టుకోలేరని, దీనిపై నినాదాలతో ప్రజలు ఎంతమాత్రం డోలాయమానంలో పడరనీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిడిపి) అధ్యక్షురాలు మెహబుబా ముఫ్తీ అన్నారు. ఈ అధికరణం జోలికి వెళ్లనంత మాత్రాన భారతీయ జనతా పార్టీ తన వాదన నుంచి వెనక్కి తగ్గినట్లు భావించాల్సిన అవసరం లేదన్నారు.
గురువారం ముఫ్తీ ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ.. ‘రెండు జెండాలు, వేరే రాజ్యాంగం అనేవి వాస్తవం. ఈ అంశంలోకి నేను పోదలచుకోలేదు. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం(ఎఎఫ్పిఎ) రద్దు, 370వ అధికరణంపై యథాతథ స్థితి కొనసాగింపు ద్వారా జమ్మూకాశ్మీర్ ప్రజలకు కానుక ఇవ్వాల్సి ఉంది' అని చెప్పారు.
తమ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా కల్లోల ప్రాంతాల చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందో లేదో రాష్ట్ర ప్రభుత్వ పరిశీలిస్తుందని తెలిపారు. తమ రాష్ట్రంలోనూ, దేశంలోనూ కొన్ని అపోహలు ఉన్నాయనీ, వీటిని తొలగించాల్సిన అవసరం ఉందని ముఫ్తీ చెప్పారు. పిడిపి-బిజెపి సంకీర్ణం ఎంత కాలం కొనసాగుతుందనే ఆందోళన తనకేమి లేదని స్పష్టం చేశారు.
రెండు పార్టీల మధ్య కుదిరిన రాజకీయ, అభివృద్ధి ఎజెండాను సాధ్యమైనంత త్వరగా అమలు చేయడంపైనే తమ దృష్టి ఉంటుందని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందించడానికి మాత్రమే తాము దొందరపడుతున్నామని చెప్పారు. భారత్-పాక్ మధ్య శాంతి వంతెనలా జమ్మూకాశ్మీర్ ఉండాలనేదే తన తండ్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ (ప్రస్తుత జమ్మూకాశ్మర్ సిఎం) ఉద్దేశమని చెప్పారు.