జైట్లీ నోట 60సార్లు 'పెట్టుబడులు': పదికి పది మార్కులేసిన సోదరి, కోడలు
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశ పెట్టిన అరుణ్ జైట్లీ నోట పెట్టుబడులు అనే పదం 60సార్లు వచ్చింది. ప్రధాని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ ప్రసంగంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విదేశఈ పెట్టుబడులు లాంటి పదాలను ఆయన పదేపదే చెప్పారు.
గత ఏడాది బడ్జెట్ ప్రసంగంలో పెట్టుబడులు అనే మాటను 34 సార్లు ఉచ్చరించిన జైట్లీ.. ఈ బడ్జెట్లో మాత్రం 60సార్లు ఉటంకించారు. అభివృద్ధి అనే మాటను 27సార్లు పలికారు. జాబ్స్ అనే మాటను 23సార్లు, స్కిల్స్ అనే మాటు 14సార్లు, లోటు అనే మాటను 6సార్లు ఉపయోగించారు. మౌలికసదుపాయాలు అనే పదాన్ని 30సార్లకు పైగా ఉపయోగించారు.
జైట్లీ ప్రసంగం దాదాపు వంద నిమిషాలు సాగింది. అందులో యూపీఏ పైన చురకలు వేశారు. జైట్లీ సోదరి మధుభార్గవ, మేనకోడలు పునితా సందర్శకుల గ్యాలరీలో కూర్చొని బడ్జెట్ ప్రసంగం తిలకించారు. కాగా, జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన ఆయన సోదరి మధుభార్గవ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ క్రియాశీల బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇది చాలా క్రియాశీల, మంచి బడ్జెట్ అన్నారు. అన్ని రంగాలకు పూర్తి ప్రాధాన్యత ఇచ్చినందుకు జైట్లీకి తాను పూర్తి మార్కులు వేస్తున్నానని చెప్పారు. అరుణ్ జైట్లీ తన చిన్న సోదరుడు కాబట్టి పదికి పది మార్కులు ఇస్తున్నానని ఆమె చెప్పారు. జైట్లీ మేనకోడలు పునీత మాట్లాడుతూ.. బడ్జెట్ చాలా బాగుందని, ముందుచూపుతో కూడుకున్నదన్నారు.