"పెద్దనోట్లు రద్దు అవకముందే బీజేపీ నేతల వద్ద రూ.2వేల నోట్లు"
న్యూఢిల్లీ : కొత్త నోట్లన్ని కోటీశ్వరులకు డోర్ డెలివరీ అయిపోతున్నాయని సంచలన ఆరోపణలు చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు. రూ.500, రూ.1000 నోట్లు దేశవ్యాప్తంగా రద్దు కావడం కన్నా ముందే బీజేపీ నేతల వద్ద రూ.2వేల నోట్లు ఉన్నాయని ఆరోపించారు.
పెద్ద నగదు నోట్ల రద్దు విషయం ప్రధాని మోడీ సన్నిహితులకు ముందుగానే చేరిపోయిందని తెలిపారు కేజ్రీవాల్. నోట్ల రద్దు విషయం పట్ల ముందుగానే తన సన్నిహితులందరినీ బీజేపీ అప్రమత్తం చేసిందని మండిపడ్డారు. దీని వెనుక అతిపెద్ద కుంభకోణం దాగుందని, నోట్ల రద్దు వల్ల బీజేపీ నేతలు చాలా లబ్ది పొందుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సామాన్యులపై సర్జికల్ స్ట్రైక్ అంటూ అభివర్ణించిన కేజ్రీవాల్.. నల్లకుబేరులంతా డాలర్లను బ్లాక్ లో కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.
దేశంలో ఉద్దేశపూర్వకంగా సంక్షోభం సృష్టించడానికే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుందని, నల్లధనం ఉన్న వ్యక్తుల జాబితాను వెంటనే బహిర్గతం చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
నోట్ల రద్దుపై బీజేపీ నేతలకు ముందస్తు సమాచారం ఉంది : కపిల్ సిబల్
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకున్న పెద్ద నగదు నోట్ల రద్దు ముందుచూపులేని చర్యగా అబివర్ణించారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. కేంద్రం నిర్ణయంతో మూడురోజులుగా దేశం మొత్తం అల్లకల్లోలంగా మారిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద నగదు నోట్ల రద్దును తప్పుబడుతూ.. దీనివల్ల బ్లాక్ మనీ ఎంత ఉందనేది ఎలా తేలుతుందని ప్రశ్నించారు.
నోట్ల రద్దు విషయంలో బీజేపీ నేతలకు ముందస్తు సమాచారం ఉందన్న ఆరోపణ చేస్తూ.. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నేతలు.. నోట్ల రద్దుకు ఒకరోజు ముందే భారీ ఎత్తున డబ్బును ఖాతాల్లో ఎలా జమ చేయగలిగారని నిలదీశారు. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రతిపక్షాలను దెబ్బకొట్టడానికే బీజేపీ ఇలాంటి నిర్ఱయం తీసుకుందని ఆరోపించారు సిబల్. నోట్ల రద్ద నిర్ణయం తర్వాత ప్రధాని మోడీ జపాన్ పర్యటనకు వెళ్లడం తీవ్రమైన తప్పుగా చెప్పారు.