పార్టీలో ముసలం: 10 రోజులు లీవ్ తీసుకొని బెంగళూరుకు కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. పది రోజుల పాటు సెలవు తీసుకోనున్నారని తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 5వ తేదీ నుండి పది రోజుల పాటు నేచరోపతి ట్రీట్మెంట్ కోసం సెలవు తీసుకోవడం గమనార్హం. అంతర్గాత విభేదాల వల్లనే ఆయన సెలవు తీసుకుంటుండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
కేజ్రీవాల్ సెలవులలో ఉన్నప్పుడు మనిష్ సిసోడియా ఆ బాద్యతలను తీసుకుంటారు. కేజ్రీవాల్ వయస్సు 46. హై బ్లడ్ షుగర్, దగ్గు నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని, ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. అతను చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లనున్నారు.
అయితే, అతని సెలవులు.. పార్టీలో ముసలం పుట్టినప్పుడే తీసుకోవడంపై చర్చ సాగుతోంది. పార్టీ సీనియర్లు, పార్టీ వ్యవస్థాపక సభ్యులు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లకు పార్టీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.