'ఇందిరాగాంధీ హత్య'పై సంచలన ప్రకటన : 'అతనికి ముందే తెలుసు'
లండన్ : భారత దివంగత ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు సంబంధించి ఓ సంచలన విషయం వెలుగు చూసింది. బ్రిటన్ వర్గాల నుంచి గురువారం నాడు వెలువడిన ఓ డాక్యుమెంట్ లో హత్యకు ముందు పరిణామాలకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
బ్రిటన్ డాక్యుమెంట్ కథనం ప్రకారం.. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురువుతారన్న విషయం హత్యోదంతానికి ముందే ఓ వ్యక్తికి తెలుసని పేర్కొంది. అతని పేరును జగ్జీత్ సింగ్ చౌహాన్ గా వెల్లడించింది బ్రిటన్ డాక్యుమెంట్. కాగా, 'సిఖ్ రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్' కు వ్యవస్థాపకుడైన జగ్జీత్ సింగ్.. అప్పట్లో ఆ సంస్థ ద్వారా ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమంపై బ్రిటన్ లో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
అయితే 1984 అక్టోబర్ లో ఇంధిరాగాంధీ చనిపోగా.. 'త్వరలోనే ఇందిరా చనిపోబోతుందని, ఆమెతో పాటు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ కూడా చనిపోతారని జూన్ నెలలోనే జగ్జీత్ సింగ్ కు తెలిసిందని బ్రిటన్ డాక్యుమెంట్ పేర్కొంది.
జగ్జీత్ సింగ్ చేసిన పలు సంచలన ప్రకటనలపై అప్పట్లో చాలాసార్లు భారత్, బ్రిటన్ గవర్నమెంట్ కు ఫిర్యాదు చేయగా.. ఆయన వ్యాఖ్యలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపేవిగా ఉండడంతో, బ్రిటన్ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోలేకపోయిందని బ్రటిన్ డాక్యుమెంట్ వెల్లడించింది.
జగ్జీత్ విషయానికొస్తే..
అప్పట్లో ఖలిస్థాన్ ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని బ్రిటన్ కేంద్రంగా ఉద్యమించారు జగ్జీత్ సింగ్. ఆయన స్వస్థలం పంజాబ్ లోని హోషియర్ పూర్. అక్కడే పుట్టి పెరిగిన అతను వైద్య విద్య పూర్తయ్యాక డాక్టర్ వృత్తిని చేపట్టారు. అనంతరం రిపబ్లిక్ పార్టీ ఇండియా నుంచి 1967లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు జగ్జీత్. అకాలీ దళ్ అధికారంలో ఉన్న కాలంలో డిప్యూటీ స్పీకర్ గాను, తర్వాతి కాలంలో ఆర్థిక శాఖ మంత్రి గాను పనిచేశారు.
ఇక 1969లో అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన జగ్జీత్ సింగ్ లండన్ కు వెళ్లి కొన్నాళ్లు అక్కడే స్థిరపడ్డారు. అదే సమయంలో 'సిఖ్ రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్' ను స్థాపించి ప్రత్యేక సిక్కు దేశం కోసం ఉద్యమించారు. ఇందుకోసం అమెరికా, పాక్, కెనడా లాంటి దేశాల మద్దతు కూడగట్టేందుకు కూడా ప్రయత్నించి విఫలమయ్యారు.
ఆ తదనంతరం మళ్లీ ఇండియాకు తిరిగొచ్చిన ఆయన ఖల్సారాజ్ పార్టీని స్థాపించినా.. పార్టీ అంతగా ప్రజాదరణ పొందలేదు. ఇదే క్రమంలో 78 ఏళ్ల వయసులో 2007 లో మరణించారు జగ్జీత్ సింగ్ చౌహాన్.