జయకు 'బెయిల్; ఊరట: ప్రత్యేక బెంచ్కు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు సుప్రీం కోర్టులో గురువారం నాడు ఊరట లభించింది. ఆమె బెయిల్ గడువును సుప్రీం కోర్టు 2015 ఏప్రిల్ 18వ తేదీ వరకు పొడిగించింది. అలాగే జయలలిత కేసును విచారించేందుకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని కర్నాటక హైకోర్టును ఆదేశించింది. ఈ కేసు విచారణ మూడు నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
గురువారం నాడు జయలలిత పిటిషన్ సుప్రీంలో విచారణకు వచ్చినప్పుడు ఆమె తరఫు న్యాయవాది కేటీఎస్ తులసీ మాట్లాడుతూ... తమ వాదనలు వినిపించేందుకు తమకు ముప్పై రోజులకు పైగా సమయం కావాలని కోరారు. అదే సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. అప్పీలు పైన తీర్పుకు జడ్జికి నెల రోజుల సమయం పడుతుందని చెప్పారు.
జయలలిత ఆస్తుల కేసును విచారించేందుకు ఏర్పాటు చేయనున్న ప్రత్యేక బెంచ్... ఏకసభ్య బెంచా లేక ద్విసభ్య బెంచా అనేది కర్నాటక హైకోర్టు జస్టిస్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. దీనిని వారు చూస్తారని చెప్పారు. జయలలిత డిసెంబర్ 8న 2.8 లక్షల పేజీల డాక్యుమెంట్లతో కర్నాటక హైకోర్టులో అప్పీలు చేశారు.
కాగా, అక్రమాస్తుల కేసులో అరెస్టైన జయ తర్వాత బెయిల్ పైన విడుదలైన విషయం తెలిసిందే. దీనిపైన ఆమె జైలు నుండి విడుదలయ్యాక స్పందించారు. ఆమె తన ప్రజాజీవితాన్ని నిప్పుల నదిలో ఈదడంతో పోల్చారు. ఇలాంటి కష్టాలు ఎదుర్కొనక తప్పదన్న విషయం తనకు తెలుసని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం తాను ఎంచుకున్న మార్గంలో కష్టాలు ఎదుర్కొనాల్సి రావడంపై తాను బాధపడడం లేదని ఆ ప్రకటనలో తెలిపారు.
జైలు నుండి విడుదలయ్యాక జయలలితకు సూపర్ స్టార్ రజనీకాంత్ లేఖ కూడా రాశారు. ఇది అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ లేఖలో జయకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జయ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి మేనకా గాంధీ కూడా జయకు లేఖ రాశారు. కష్టాలు తొలిగి, మళ్లీ సీఎం పీఠంపై కూర్చోవాలని లేఖలో ఆకాంక్షించారు.
రజనీ లేఖ పైన జయ స్పందించారు కూడా. తనకు శుభాకాంక్షలు చెబుతూ లేఖ రాసిన రజనీకాంత్, మేనకా గాంధీలకు జయలలిత ధన్యవాదాలు తెలిపారు. కేంద్రమంత్రిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన గురించి ఆలోచించడం తనను కదిలించిందని, మీ ఉత్తరం తన మనసు లోతులను తాకిందని జయ.. మేనకా గాంధీ లేఖ పైన స్పందించారు.
మీ ఉత్తరం చూసి ఎంతో సంతోషించానని, మీరు వ్యక్తం చేసిన సానభూతికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని, మీ కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు అని జయ.. రజనీకి ప్రత్యుత్తరం రాశారు.
జయ అరెస్టు, విడుదల పైన డీఎంకే అధ్యక్షులు కరుణానిధి కూడాస్పందించారు. జయలలిత జైలు నుండి విడుదల కావడంపై డీఎంకే అధ్యక్షులు కరుణానిధి నాడు స్పందించారు. జయలలిత జైలుకు వెళ్లినప్పుడు తాను సంతోషించలేదని, అలాగే ఇప్పుడు విడుదలై బయటకు వస్తే బాధపడలేదని చెప్పారు.