నేపాల్ భూకంపం: 41మంది భారతీయులు మృతి, 7,276కు చేరిన మృతులు
ఖాట్మాండ్: నేపాల్లో ఇటీవల సంభవించిన భారీ భూకంపంలో ఇప్పటివరకు 41మంది భారతీయులు మృతి చెందారు. నేపాల్ విపత్తులో మొత్తం 57 మంది విదేశీయులు మృతి చెందగా.. వీరిలో 41 మంది భారతీయులు ఉన్నారని నేపాల్ పోలీసులు వెల్లడించారు. మరో 10మంది గాయాలయినట్టు తెలిపారు.
ఈ విపత్తులో ఇప్పటివరకు 7,276 మంది మృతి చెందారు. మరో 14,267 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నేపాల్ ఆర్థిక మంత్రి రాంశరణ్ మహత్ వెల్లడించారు.
కాగా, గోర్ఖా జిల్లాలోని మారుమూల గ్రామంలో భూకంప శిథిలాల్లో చిక్కుకున్న 22మంది బుద్ధ సన్యాసులను భారత వైమానిక దళం కాపాడింది. భారత యువ పర్వతారోహకుడు అర్జున్ వాజ్పాయిని కాపాడిన నేపాల్ సహాయక బృందాలు ఖాట్మాండ్కు తరలించాయి.
భూకంప బాధితుల కోసం ప్రధాని ప్రార్థనలు
సోమవారం ఢిల్లీలో జరగనున్న బుద్ధపూర్ణిమ దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. బుద్ధుని జన్మస్థలమైన నేపాల్, భూకంప బాధితుల కోసం ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ప్రపంచమంతటి నుంచి పలువురు బౌద్ధ సన్యాసులు, మేధావులు, దౌత్యవేత్తలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇక్కడి బుద్ధుడి స్థూపాన్ని ఆయన జీవితం, బోధనలకు అంకితమిచ్చే కేంద్రంగా మార్చే అంశంపై చర్చించనున్నారు. సోమవారం జరగనున్న అసామాన్యమైన ఉత్సవాల గురించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజీజు ప్రకటించారు. బుద్ధునికి జ్ఞానోదయమైంది, బౌద్ధ మతం పుట్టింది మన దేశంలోనేనని పేర్కొన్నారు.