ఆప్లో ముసలం: సీనియర్లు గుడ్బై, జాతీయ కన్వీనర్ పదవికి కేజ్రీ రిజైన్...?
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్ధాపక సభ్యుడు ప్రశాంత్ భూషణ్, మరో సీనియర్ నేత యోగేంద్ర యాదవ్లు పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీని ప్రక్షాళన చేయాలని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆలోచిస్తున్న నేపథ్యంలో పార్టీని వీడాలనే ఆలోచనలో ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మంత్రి వర్గ విస్తరణ లేదని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేయడంతో ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్లు పార్టీని వదిలి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం నుంచి శనివారం వరకు జరిగిన సమావేశంలో పార్టీలో సభ్యుల మధ్య విబేధాలు తలెత్తిన కారణంగా సీనియర్లు ఇద్దరూ తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పేలవ ప్రదర్శన తర్వాత కేజ్రీవాల్తో ప్రశాంత్భూషణ్, యాదవ్ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎంగా రెండు పదవులను నిర్వహిస్తున్నారు.
ఈ విషయంపై కూడా పార్టీ సమావేశాల్లో చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలోని కొంత మంది నేతలు కేజ్రీవాల్ రెండు పదవుల్లో ఉండటం ఏంటని ప్రశ్నించడంతో ఆయన పార్టీ జాతీయ కన్వీనర్ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలంటే రెండు పదవుల్లో కేజ్రీవాల్ ఉండటమే సమంజమని కొందరు నేతలు భావిస్తున్నారు.
ఢిల్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీని ప్రక్షాళన చేయనున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక చేసిన విధానం సరిగా లేదని, పార్టీలోని కొందరు సీనియర్లు ఈ సమావేశంలో కేజ్రీవాల్ని నిలదీసినట్లు తెలుస్తోంది.