మహిళా పోలీసును బెల్టు కింద కర్రతో పొడిచి!, 'రుతుస్రావం' వేధింపులు
రాయ్ పూర్ : అభివృద్ది విషయంలో అన్ని రంగాల్లోను భాగస్వాములవుతోన్న మహిళలకు.. అదే స్థాయిలో వేధింపులు కూడా ఎదురవుతున్నాయి. డీఎస్పీ స్థాయి అధికారులు సైతం.. మహిళా ట్రైనీల పట్ల వేధింపులకు దిగడం ఇందుకో ప్రత్యక్ష ఉదాహరణ. ఇక అసలు విషయానికొస్తే.. ఛత్తీస్గఢ్లోని చంఖూరీ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న పోలీసు అధికారిణులను స్థానిక డీఎస్పీ వేధింపులకు గురిచేయడం వివాదస్పదమవుతోన్న విషయం.
డీఎస్పీ నీలకాంత్ సాహు వేధింపులపై డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ అధికారిణి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మిగతా అధికారిణిలు కూడా డీఎస్పీ నీలకాంత్ సాహు వేధింపులపై పెదవి విప్పడం మొదలుపెట్టారు. మొత్తం 32 మంది మహిళా పోలీసు అధికారిణిలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల ద్రుష్టికి తీసుకెళ్లారు.
బాధిత అధికారిణలు పేర్కొంటున్న ఫిర్యాదులను పరిశీలిస్తే.. 'ఓ ట్రైనీ మహిళాధికారిని ఆమె బెల్టుకు క్రింది భాగంలో కర్రతో పొడిచి.. ఆపై అసభ్యకరమైన మాటలతో వేధించాడని' ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్రైనీల హాజరును లెక్కించాలన్న నెపంతో.. స్విమ్మింగ్ పూల్ లో మహిళల జుట్టు పట్టుకుని లాగుతున్నారని , ఇలాంటి వేధింపులు నిత్యం ఎదురవుతున్నాయని అయినా ఎవరికి ఫిర్యాదు చేయలేకపోయామని తెలిపారు.
శిక్షణ సమయంలో.. ఓ మహిళాధికారి బట్టలకు అంటిన మురికిని సదరు డీఎస్పీ కర్రతో తుడిచారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. 'మహిళలకు సంబంధించిన రుతు స్రావ తేదీలను నమోదు చేసుకుంటున్నారని, ఒకవేళ గత నెలకు, ప్రస్తుత నెల రుతుస్రావానికి తేదీల్లో తేడా వస్తే.. అందరిముందు గట్టిగా అరుస్తూ అవమానిస్తున్నారని, తలదించుకునేలా మాటలతో అవమానిస్తున్నారని తమ గోడు వెల్లబోసుకుంటున్నారు' ట్రైనీ మహిళాధికారులు.
'రుతుస్రావం సమయంలో నా భార్యకు రాని నొప్పులు.. మీకెందుకు వస్తున్నాయని, సాకులు చెప్పి శిక్షణ తప్పించుకోవద్దని హెచ్చరిస్తున్నారని' ఆవేదన వ్యక్తం చేశారు. రుతుస్రావం జరిగిన మహిళాధికారులను శిక్షణ బయట ఉంచుతున్నారని.. ఆ సమయంలో కనీసం విశ్రాంతి తీసుకునేందుకు కూడా అకాడమీ నిబంధనలు అనుమతించట్లేదని చెప్పారు.
ఓ గర్భిణీ అధికారిణి పట్టుకుని.. 'నీకు బేబీ బంప్స్ ఎందుకు లేవు?' అంటూ డీఎస్పీ సాహు అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. కాగా, డీఎస్పీ సాహుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. చర్యలు ప్రారంభించిన పోలీస్ యంత్రాంగం సాహును హెడ్ క్వార్టర్స్ లోని పోలీస్ లైన్స్ కు తరలించి, విధుల నుంచి విముక్తి కల్పించారు. ట్రైనీ మహిళల నుంచి వస్తోన్న ఫిర్యాదులను నమోదు చేస్తున్నట్లుగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ హర్షిత తెలిపారు.