జమ్ములో నవజ్యోత్ సింగ్ సిద్ధు పైన రాళ్ల దాడి
శ్రీనగర్: మాజీ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు పైన గురువారం నాడు జమ్ము కాశ్మీర్లో రాళ్ల దాడి చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన ప్రచారం చేసేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా జమ్ము ఔట్ స్కర్ట్స్లో పలువురు సిక్కు యువకులు అతని వాహనం పైన రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థి కేవిందర్ గుప్తా తరఫున ఎన్నికల ప్రచారానికి సిద్ధు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. కేవీందర్ గుప్తా గాంధీ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.
ఇదే ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి రమణ్ భల్లా పోటీ చేస్తున్నారు. అయితే, ఈ దాడిలో సిద్ధుకు ఎలాంటి గాయాలు కాలేదు. నలుగురు పోలీసులు సిద్ధును రక్షించారు. వారికి స్వల్పంగా గాయాలయ్యాయి.
ఎస్హెచ్ఓ సత్వరీ కుల్జీత్ చౌదరీ మాట్లాడుతూ.. తమ మతానికి చెందిన గ్రంథం పైన ఇటీవల సిద్ధు చేసిన వ్యాఖ్యలే ఆయన పట్ల ఆ యువకులకు ఆగ్రహం తెప్పించాయని చెబుతున్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి అరుణ్ గుప్తా మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారంతా ప్రాంతీయ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులని, భారీగా ఓటింగ్ పోల్ కానుందని, తమ గెలుపు ఖాయమని భయపడే, వారు ఇలా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలు చేశారని ఆయన గుర్తు చేశారు.
కాగా, ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గత మూడు రోజులుగా సిధ్దు పైన ఇది రెండో దాడి. జమ్ము ప్రాంతంలో ఓ ర్యాలీలో పాల్గొన్న అనంతరం తిరిగి వస్తున్న సిద్ధు పైన దిడియానా ప్రాంతంలో కొందరు రాళ్లు విసిరారు. ఇది రెండో ఘటన. ఇదిలా ఉండగా, ఈ దాడి నేపథ్యంలో సిద్ధు భోర్లోని తన బహిరంగ సభను రద్దు చేసుకున్నారు. సిద్ధును ప్రచారం కోసం మరో ప్రాంతానికి పంపిస్తామని పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు.