ఢిల్లీపై రాందేవ్ కన్ను: 200ఎకరాలకు రూ.360కోట్లు
న్యూఢిల్లీ: తమ సంస్థ పతంజలి ఉత్పత్తులతో బహుళజాతి కంపెనీలకు గుబులు పుట్టిస్తున్న యోగా గురు బాబా రాందేవ్ దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేస్తున్నారు. ఆ భూముల్లో పతంజలి ఉత్పత్తుల కోసం మరో యూనిట్ను నెలకొల్పేందుకు పావులు కదువుతున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఉత్తర భారతంలో పతంజలి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా తమ తయారీ యూనిట్లను పెంచుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ వేపై ప్రతిపాదించిన పతంజలి యూనివర్సిటీ క్యాంపస్కు పక్కనే ఈ తయారీ యూనిట్ను నిర్మించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై యమునా ఎక్స్ ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ(వైఈఐడీఏ)తో పతంజలి కంపెనీ చర్చిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో బాబా రాందేవ్.. రూ.320 కోట్లతో 200 ఎకరాల ప్లాట్ను కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. యూనివర్సిటీ కోసం 150ఎకరాలను రూ.240 కోట్లకు కొనుగోలు చేయనున్నారు. ఫ్యాక్టరీ కోసం ఇండస్ట్రియల్ స్థలాన్ని, యూనివర్సిటీ కోసం ఇన్ స్టిట్యూషనల్ స్థలాన్ని కావాలని పతంజలి కంపెనీ తమతో చర్చించినట్టు వైఈఐడీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్ వీర్ సింగ్ తెలిపారు.
కాగా, ప్రస్తుతం పతంజలి కేవలం ఒక్క తయారీ యూనిట్నే కలిగి ఉంది. అది ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉంది. మొదట 10 ఎకరాలతో ప్రారంభించిన ఈ యూనిట్, ప్రస్తుతం 150 ఎకరాలకు విస్తరించారు. వచ్చే రెండేళ్లలో మరో నాలుగు తయారీ యూనిట్లను స్థాపించాలని పతంజలి భావిస్తోంది. 1997లో చిన్న ఫార్మసీగా పతంజలి హరిద్వార్లో ప్రారంభమైంది.
పతంజలి న్యూడుల్స్, షాంపులు, సబ్బులు ఇలా పలురకాల నిత్యావసర, సౌందర్య ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. 6నెలల కాలంలో ఈ ఉత్పత్తులు 64శాతం పెరిగి రూ.731 కోట్లగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది.
క్రెడిగ్ రేటింగ్లో సైతం పతంజలి దూసుకుపోతోంది. బ్రిక్ వర్క్ ఇచ్చిన రేటింగ్స్ లో పతంజలి ప్రొవిజనల్ టర్న్ వర్ ఆర్థికసంవత్సరం 2016లో మొదటి 10నెలల కాలంలో రూ.3,266.97 కోట్లగా నమోదైనట్టు పేర్కొంది. అయితే గతేడాది ఇదే సమయంలో ఈ టర్న్ వర్ రూ.1,587.51 కోట్లగా ఉంది.