ఫ్లైట్ డైవర్ట్.. మోడీకి హైజాక్ అలర్ట్, జైపూర్ ఎయిర్ పోర్టులో హై డ్రామా
ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తున్న జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని జైపూర్ కు మళ్లించడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి ఏం జరిగిందో అర్థం కాలేదు. కొందరైతే విమానం హైజాక్ జరిగిందనే అనుమానంతో హడలిపోయారు.
జైపూర్ : జైపూర్ ఎయిర్ పోర్టులో గురువారం హై డ్రామా చోటుచేసుకుంది. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తున్న జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని జైపూర్ కు మళ్లించడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి ఏం జరిగిందో అర్థం కాలేదు.
కొందరైతే విమానం హైజాక్ జరిగిందని అనుమానపడ్డారు. ఓ ప్రయాణికుడు తమ విమానం హైజాక్ అయిందంటూ ఏకంగా ప్రధాని నరేంద్రమోడీకే అలర్ట్ పంపారు. సదరు ప్రయాణికుడు ఈ మేరకు మోడీకి ట్వీట్ చేశారు.
'నరేంద్రమోడీ సర్.. మేం మూడు గంటలుగా జెట్ ఎయిర్ వేస్ విమానంలో ఉన్నాం.. ఇది అచ్చం హైజాక్ మాదిరిగానే ఉంది. ప్లీజ్ సాయపడండి..' అంటూ నితిన్ అనే ప్రయాణికుడు ట్వీట్ ను పంపారు.
ఈ ట్వీట్ కు ప్రధాని మోడీ నుంచి నేరుగా స్పందన రాలేదు కానీ, కాసేపటి తరువాత జెట్ ఎయిర్ వేస్ స్పందించింది. '' హాయ్ నితిన్, ఢిల్లీలో ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందున మన విమానం 9W 355కి జాప్యమవుతుంది'' అని పేర్కొంది.
జెట్ ఎయిర్ వేస్ స్పందనకు సంతృప్తి చెందని ప్యాసెంజర్ నితిన్ వెంటనే.. 'దీనికి సంబంధించి మాకు కన్ ఫర్మేషన్ ఇవ్వగలారా? ఎందుకంటే ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే ఇతర విమానాల క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే షెడ్యూల్ అవుతాయంటూ..' మరో ట్వీట్ చేశారు.
జైపూర్ ఎయిర్ పోర్టులో సెక్యురిటీ ఏజెన్సీలను ప్రయాణికులు తీవ్ర గందరగోళంలో ముంచెత్తారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే విమానాన్ని మళ్లించినట్లు జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ ఎంపీ బన్సాల్ తెలిపారు.
ఐదు జెట్ ఎయిర్ వేస్ విమానాలు, ఒక ఒమాన్ విమానం వివిధ ప్రాంతాల నుంచి న్యూఢిల్లీలో ల్యాండ్ అవబోతున్నాయని, ఈ కారణం వల్లనే ముంబై-ఢిల్లీ విమానాన్ని జైపూర్ ఎయిర్ పోర్టుకు మళ్లించారని ఆయన వివరించారు.
అనంతరం ఈ విమానం తుది గమ్యస్థానమైన ఢిల్లీలో ల్యాండ్ అయ్యే వరకు సెక్యురిటీ ప్రోటోకాల్ ను వారికి అందించారు. ఈ విమానంలో 8 మంది సిబ్బందితో పాటు 176 మంది ప్రయాణికులున్నారు. మొత్తం మీద సరైన సమాచారం అందక ప్రయాణికులు విమానం హైజాక్ కు గురైందని అనుకుని హడలిపోయారు.