టైర్లలో ‘బాహుబలి’.. రూ.60 వేలకు ఎగబాకిన ఎంఆర్ఎఫ్ షేరు ధర
దేశంలోనే అతిపెద్ద టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ సోమవారం స్టాక్ మార్కెట్ లో మెరుపులు మెరిపించింది. ఒక్కసారిగా ఈ కంపెనీ షేరు ధర ఎగబాకి రూ.60 వేల మార్కును కొల్లగొట్టింది.
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ సోమవారం స్టాక్ మార్కెట్ లో మెరుపులు మెరిపించింది. ఒక్కసారిగా ఈ కంపెనీ షేరు ధర ఎగబాకి రూ.60 వేల మార్కును కొల్లగొట్టింది.
సోమవారం మధ్యాహ్నం ట్రేడింగ్ లో మొట్టమొదటిసారి ఆ కంపెనీ షేరు ధర రూ.60 వేలు దాటినట్లు వెల్లడైంది. ఈ కంపెనీ షేరు ధర రూ.59.250 వద్ద మొదలైంది. అనంతరం ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో రూ.60.140కి చేరింది. అయితే చివరికి 1.21 శాతం లాభంతో రూ.59,900 వద్ద ముగిసింది.
విలువ పరంగా చూసుకుంటే, ఎంఆర్ఎఫ్ ఎక్కువ ఖరీదైన దేశీయ స్టాక్. దీని తరువాత ఐషర్ మోటార్స్ (రూ.24,322), బోస్ (రూ.22,988), శ్రీ సిమెంట్ (రూ.16,400), పేజ్ ఇండస్ట్రీస్ (రూ.14,803), 3ఎం ఇండియా (రూ.11,080) లు ఉంటాయి.
ఈ దశాబ్దం ప్రారంభం నుంచి ఎంఆర్ఎఫ్ షేరు ధర రూ.4,759 శాతం పైకి ఎగసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఈ కంపెనీ షేరు ధర 50 సార్లు పెరిగి మార్చి 24 నాటికి రూ.59,184కు చేరుకుంది.
ఫిబ్రవరి నెల నుంచి రబ్బరు ధరలు తగ్గటం ఎంఆర్ఎఫ్, అపోలో వంటి టైర్ల తయారీ కంపెనీలకు కలిసొచ్చింది. ఎంఆర్ఎఫ్ తోపాటుగా సోమవారం మధ్యాహ్నం ట్రేడింగ్ లో అపోలో టైర్స్ కూడా లాభపడినట్లు తెలుస్తోంది.