బెంగళూరు బాంబు పేలుడు కేసు: ఎన్ఐఏ దర్యాప్తు
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డు సమీపంలోని చర్చిస్ట్రీట్ లో జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తు నేషనల్ ఇన్వేష్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక హోం శాఖ మంత్రి కే.జే. జార్జ్ స్పష్టం చేశారు.
బెంగళూరు పోలీసులు ఇప్పటికే చర్చిస్ట్రీట్ బాంబు పేలుడు కేసు దర్యాప్తు చేశారని అన్నారు. బెంగళూరు పోలీసులు వివిద రాష్ట్రాలకు వెళ్లి దర్యాప్తు చేశారని, అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని జార్జ్ చెప్పారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నామని జార్జ్ వివరించారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఉగ్రవాదులు బెంగళూరులోని చర్చిస్ట్రీట్ లో బాంబు పెట్టి ఉంటారని వెలుగు చూసిందని, అందుకే ఈ కేసు దర్యాప్తు ఎన్ఐఏకి అప్పగిస్తున్నామని జార్జ్ వివరించారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ వ్రాశామని జార్జ్ తెలిపారు.
డీజీపీ సమావేశం: ఎన్ఐఏకి ఇవ్వాలని నిర్ణయం ?
మంగళవారం కర్ణాటక డీజీపీ ఓం ప్రకాష్ నేతృత్వంలో సీనియర్ పోలీసు అధికారులు సమావేశం జరిగింది. ఈ సందర్బంలో చర్చిస్ట్రీట్ బాంబు పేలుడు కేసు దర్యాప్తు విషయంపై చర్చించారు. ఇప్పటి వరకు బాంబు పెట్టిన వారిని పట్టుకొలేదని, అసలు గుర్తించలేదని డీజీపీ అధికారులను ప్రశ్నించారని తెలిసింది.
ఈ కేసు దర్యాప్తు నివేదికను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు పంపించాలని డీజీపి నిర్ణయించారు. నాలుగు రాష్ట్రాలకు వెళ్లి విచారణ చేసిన నివేదికను రాజ్ నాథ్ సింగ్ కు అందించాలని డీజీపి నిర్ణయం తీసుకున్నారని ఒక పోలీసు అధికారి చెప్పారు.
ఇప్పటికే కేసు నమోదు చేసిన ఎన్ఐఏ.....!
వారం క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చర్చిస్ట్రీట్ బాంబు పేలుడు కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది అని నివేదిక పంపించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ వ్రాశారు. అప్పుడే ఎన్ఐఏ అధికారులు చర్చిస్ట్రీట్ బాంబు పేలుడు కేసు పై దృష్టి పెట్టారని తెలిసింది.
ఎన్ఐఏ అధికారులు చర్చిస్ట్రీట్ బాంబు పేలుడు కేసు దర్యాప్తు నివేదికను పరిశీలించారని సమాచారం. చర్చిస్ట్రీట్ బాంబు పేలుడు కేసులో ఇప్పటికే సిమి, ఇండియన్ ముజాహుద్దిన్ తో పాటు కొన్ని ఉగ్రవాద సంస్థల మీద ఎన్ఐఏ అధికారులు నిఘా వేశారు.