ఉగ్రవాదుల దాడి: రూ. కోటి పరిహారం ఇవ్వాలని విద్యార్థిని డిమాండ్
బెంగళూరు: ఉగ్రవాదుల జరిపిన దాడిలో తన కాలు పూర్తిగా దెబ్బతినిందని, నష్టపరిహారంతో పాటు వికలాంగుల కోటాలో తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని విద్యార్థిని కర్ణాటక హై కోర్టును ఆశ్రయించింది. సమాధానం చెప్పాలంటు హై కోర్టు కేంద, రాష్ర్ట ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
శుక్రవారం హై కోర్టులో లిషా అనే విద్యార్థిని అర్జీ సమర్పించింది. అందులో తనకు రూ. ఒక కోటి నష్ట పరిహారం ఇప్పించాలని మనవి చేసింది. అదే విధంగా తన జీవితం సవ్యంగా సాగడానికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని మనవి చేసింది.
2013 ఏప్రిల్ 17వ తేదిన ఉదయం 10.28 గంటల సమయంలో బెంగళూరులోని మల్లేశ్వరంలోని రాష్ట్ర బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ సందర్బంలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. 16 మంది పోలీసులతో పాటు స్థానికులకు గాయాలైనాయి.
కాలేజ్ కు వెళుతున్న లీషా ఎడమకాలిలోకి ఇనుపచువ్వలు చొచ్చుకు వెళ్లి తీవ్రగాయాలైనాయి. ఆమె అప్పటి నుండి చికిత్స చేయించుకుంటున్నా ఇంకా నయం కాలేదు. ఇప్పటి వరకు తనకు వైద్యం చేయించుకొవడానికి రూ. 7 లక్షలు ఖర్చు అయ్యిందని లిషా కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.
అయినా ఇంకా తన కాలు నయం కాలేదని, ఉగ్రవాదుల దాడుల వలనే తనకు ఈ గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఉగ్రవాదుల దాడులు చేసిన సమయంలో నష్టం జరిగితే నష్టపరిహారం చెల్లించాలని చట్టంలో ఉందని లిషా తన అర్జీలో మనవి చేసింది.