రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె: కార్యకలాపాలకు ఆటంకం
తొమ్మిది బ్యాంకుల సంఘాల ఆధ్వర్యంలో రేపు (మంగళవారం) భారీ ఎత్తున సమ్మె నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ తదితర బ్యాంకులు తమ తమ కస్టమర్లకు సమ్మె సమాచారాన్ని తెలియజేశాయి.
న్యూఢిల్లీ: తొమ్మిది బ్యాంకుల సంఘాల ఆధ్వర్యంలో రేపు (మంగళవారం) భారీ ఎత్తున సమ్మెకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ తదితర బ్యాంకులు తమ తమ కస్టమర్లకు సమ్మె సమాచారాన్ని తెలియజేశాయి. సమ్మె కారణంగా తమ బ్యాంకు కార్యకలాపాలకు, సేవలకు అంతరాయం కలిగే అవకాశముందన్న సూచనలను అందించాయి.
ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు వంటి ప్రయివేటు బ్యాంకులు యథావిథంగా విధులు నిర్వర్తించనున్నాయి. కేవలం చెక్ క్లియరెన్స్లో మాత్రం జాప్యం జరిగే అవకాశముంది.
దేశవ్యాప్తంగా, ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్సీబీసీ, ఏబబీఓఏ,బీఈఎఫ్ఐ, ఐఎన్బీఈ ఎఫ్, ఐఎన్ బీఓసీ, ఎన్ఓబీడబ్ల్యు, ఎన్ఓబీఓ యూనిమయన్ల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28 న ఒక రోజు సమ్మె చేపట్టనున్నారు.
బ్యాంకుయూనియన్లతో కేంద్ర ప్రభుత్వ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వరంలో జరిగిన సమావేశంలో విఫలం కావడంతో ఈ సమ్మె అనివార్యమైంది. యూనియన్ల డిమాండ్లను బ్యాంకుల మేనేజ్మెంట్ బాడీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తిరస్కరించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బ్యాంకు ఉద్యోగులు, అధికారులు, పాతతరం ప్రయివేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులుఈ సమ్మెలో పాల్గొంటాయి.
మొండి బకాయిలను రాబట్టడంలో బ్యాంకు ఉన్నతాధికారులు జవాబుదారీగా ఉండాలి, అన్ని స్థాయిల్లో ఖాళీల భర్తీ, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు కఠిన శిక్షలు వంటి పలు డిమాండ్లతో సమ్మెకు దిగనున్నట్లు యునైటెడ్ ఫోరం బ్యాంకు యూనియన్ (యుఎఫ్బియు) నేతృత్వంలోని బ్యాంకు సంఘాలు తెలిపాయి.
అయితే (భారతీయ మజ్దూర్ సంఘ్కు అనుబంధంగా ఉన్న జాతీయ బ్యాంకు ఉద్యోగుల సంఘం (నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంకు వర్కర్స్), జాతీయ బ్యాంకు అధికారుల సంఘాలు ( నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్) మాత్రం సమ్మెలో పాల్గొనడం లేదు.
ఫిబ్రవరి 21న భారత బ్యాంకుల సమాఖ్య (ఐబిఎ)తో జరిపిన చర్చలు విఫలమైనట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (ఎఐబిఇఎ) ప్రకటించింది. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆదివారం ప్రకటించారు.
కేంద్రం తీసుకొచ్చిన కార్మిక సంస్కరణలపై కూడా బ్యాంకు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. బ్యాంకింగ్ రంగంలో శాశ్వత ఉద్యోగాలను తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ సంఘాలు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బ్యాంకింగ్ సంస్కరణలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టనున్నాయి.
ముఖ్యంగ గత ఏడాది నవంబర్ నెలలో కేంద్రం చేపట్టిన నోట్ల రద్దు కాలంలో అదనంగా పని చేసిన ఉద్యోగులకు పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 75 శాతం వ్యాపారాన్ని కలిగి ఉన్నాయి.