ఒబామాపై ఎన్నో ఆశలు, తాజ్ను కట్: భారత్లో పర్యటించింది వీరే
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాక కోసం ఢిల్లీ సిద్దమైంది! ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి ఒబామా భారత్ పర్యటనకు వస్తున్నారు. అతను మూడు రోజుల పాటు పర్యటిస్తారు. మూడో రోజు తాజ్ మహల్ సందర్శనను ఒబామా దంపతులు రద్దు చేసుకున్నారు.
సౌదీ అరేబియా రాజు మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఒబామా భారత్ నుండి నేరుగా అక్కడకు వెళ్తారు. ఈ నేపథ్యంలో తాజ్ సందర్శన రద్దు చేసుకున్నారు.
ఒబామా తాజా పర్యటన వివరాలు...
ఆదివారం ఉదయం పది గంటలకు ఢిల్లీకి వస్తారు. పన్నెండు గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీలుస్వాగతం పలుకుతారు. పన్నెండు నలభై నిమిషాలకు రాజ్ ఘాట్ వెళ్లి మహాత్ముడికి నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు హైదరాబాద్ హౌస్లో మోడీ, ఒబామాలు భేటీ అవుతారు.
సాయంత్రం నాలుగు పదికి మోడీ, ఒబామా మీడియా సమావేశం. రాత్రి ఏడున్నరకు మౌర్య హోటల్లో అమెరికా ఎంబసీ సిబ్బంది కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు. ఏడు యాభై నిమిషాలకు రాష్ట్రపతి భవన్లో విందు ఉంటుంది.
జనవరి 26వ తేదీన పది గంటలకు గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. తర్వాత రాష్ట్రపతి భవన్ వెళ్తారు. మధ్యాహ్నం మోడీతో కలిసి సీఈవో సదస్సులో పాల్గొంటారు. రాత్రి ప్రధాని గౌరవపూర్వకంగా ఇచ్చే విందులో పాల్గొంటారు.
జనవరి 27వ తేదీన పదిన్నర గంటల ప్రాంతంలో ఢిల్లీలోని సిరికోటకు వస్తారు. మధ్యాహ్నం హోటల్లో భోజనం చేస్తారు. అక్కడి నుండి సౌదికి బయలుదేరుతారు.
ఎన్నో ఆశలు..
బరాక్ ఒబామా రాక నేపథ్యంలో ఇరుదేశాల మధ్య జరిగే ఒప్పందాల పైన ఎన్నో అంచనాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంబంధాలు, రక్షణకు సంబంధించిన ఒప్పందాలు తదితరాలకు అమెరికా - భారత్ చర్చల్లో ప్రాధాన్యత ఉండనుంది. భారత్ పర్యటనకు ఒకరోజు ముందు ఒబామా పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తీవ్రవాదం విషయంలోను అమెరికా తోడ్పాటు ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఉండవచ్చునని ఆశిస్తున్నారు.
భారత దేశానికి ఆరుగురు అధ్యక్షులు...
బరాక్ ఒబామా గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఓ అమెరికా అధ్యక్షుడు గణతంత్ర దినోత్సవాలకు రావడం ఇదే మొదటిసారి. ఇక ఇప్పటి వరకు ఆరుగురు అమెరికా అధ్యక్షులు భారత్ వచ్చారు. 1959లో ఐసన్ హోవర్, 1969లో రిజర్డ్ నిక్సన్, 1978లో జిమ్మీకార్టర్, 2000లో బిల్ క్లింటన్, 2006లో జార్జ్ డబ్ల్యు బుష్, 2010లో బరాక్ ఒబామా వచ్చారు. రెండోసారి భారత్ రావడం, గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుక వస్తున్న అధ్యక్షుడు మాత్రం ఒబామానే.
మన ప్రధానులు తొమ్మిది మంది...
మన ప్రధానులు తొమ్మిది మంది అమెరికాలో పర్యటించారు. వారిలో మన్మోహన్ సింగ్ ఎనిమిది సార్లు, వాజపేయి నాలుగుసార్లు పర్యటించారు.
దేశంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల, భద్రత కట్టుదిట్టం
బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా దేశంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అయితే ఢిల్లీ మినహా దేశంలో జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ర్టాల్లో విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని ఐబీ అధికారులు భావిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాల పోలీసులు ప్రముఖ నగరాలు, పట్టణాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు.
ఒబామా రాకకు నిరసనగా సంబల్పూర్ వద్ద రైల్వే ట్రాక్ను పేల్చివేత
ఒబామా రాకను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు విధ్వంసాకి పాల్పడ్డారు. ఒడిశాలోని మునుగోడు వద్ద సంబల్పూర్ ప్రధాన రైల్వే ట్రాక్ను శనివారం మావోలు పేల్చివేశారు. రెండుచోట్ల ట్రాక్ను పేల్చివేయడంతో టాటా నగర్ నుంచి బొకోరో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఒబామా పర్యటనకు వ్యతిరేకంగానే ఈ చర్యకు పాల్పడ్డామని మావోయిస్టులు సంఘటనా స్థలిలో బ్యాన్ర్లు వదిలారు.