అందాల భామలు అర్థరాత్రి: నోరు చేసుకున్న ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: అందమైన ఆడవాళ్లు అర్ధరాత్రి ఒంటరిగా ధైర్యంగా తిరగాలంటే పోలీస్ వ్యవస్థ మొత్తం తమ పార్టీ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసన సభ్యుడు, ఢిల్లీ మాజీ న్యాయ శాఖ మంత్రి సోమనాథ్ భారతీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈయన వ్యాఖ్యలపై పలు పార్టీల నాయకులతో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు.
అర్దరాత్రి ఆడవాళ్లు ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. అయితే అందుకు విరుద్ధంగా సోమనాథ్ భారతీ మాట్లాడారు. ఢిల్లీలో అందమైన మహిళలు స్వేచ్చగా తిరగాలంలే పోలీసులు తాము చెప్పినట్లు వినాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.
మాజీ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్ఠ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ శాఖ మంత్రిగా ఉంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి దొంగ సర్టిఫికెట్లతో చిక్కి పోయిన సోమనాథ్ భారతీ నోటిలో అంతకంటే మంచిమాటలు ఎలా వస్తాయని వ్యంగంగా అన్నారు.
సోమనాథ్ మాటలు వికారంగా ఉన్నాయి, ప్రతి మాట మహిళను కించపరిచే విధంగా ఉందని ఆమె ఆరోపించారు. బీజేపీ నాయకులు సైతం మాజీ మంత్రి, ఆప్ శాసన సభ్యుడు సోమనాథ్ భారతీ మీద విరుచుకుపడ్డారు. మహిళల గురించి చులకనగా మాట్లాడారని విమర్శించారు.
అయితే ఈ విషయంపై మళ్లి స్పందించిన సోమనాథ్ భారతీ తను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అందమైన మహిళలు ఒంటినిండా నగలు ధరించి నడిరోడ్డు మీద స్వేచ్చగా తిరగడం గొప్ప విషయం కాదా, పోలీసులు తమ చేతిలో ఉంటే ఆ పరిస్థితులు కల్పిస్తామని సమర్ధించుకున్నారు. ఆప్ కు సోమనాథ్ భారతీ తలనోప్పిగా తయారైనాడని ఆపార్టీ నాయకులే అంటున్నారు.