బెంగళూరు పేలుడు: బీహార్లో ఒకరి పట్టివేత, విచారణ
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు చర్చి స్ట్రీట్ పేలుడు కేసులో బీహార్ పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు ప్రశ్నించనున్నారు. బెంగళూరు పేలుడు ఘటనతో అతనికి ఏ మాత్రం ప్రమేయం ఉంది, అసలు ఉందా, లేదా అనే విషయాలను ధ్రువీకరించుకోవడానికి ఎన్ఐఎ అధికారులు విచారణ చేపట్టునున్నారు.
ఎన్ఐఎ అప్రమత్తం చేయడంతో బీహార్ పోలీసులు జెహనాబాద్లో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి అనుమానితుడు మాత్రమేనని, విచారణ తర్వాతనే అతనిపై ఏ విధమైన నిర్ణయానికైనా రాగలమని ఎన్ఐఎ వర్గాలు వన్ ఇండియాకు వెల్లడించాయి. బీహార్లో బెంగళూరు పేలుడుకు పథక రచన జరిగినట్లు అనుమానిస్తున్నారు.
పాట్నా, బుద్ధగయ, చెన్నై రైలు పేలుళ్ల ఘటనలతో బీహార్కు సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈ దాడుల మధ్య గల పోలికలను ఎన్ఐఎ అధ్యయనం చేస్తోంది. అయితే, ఈ విషయం ఇప్పటి వరకు ఏ విధంగానూ నిర్ధారణ కాలేదు. నిందితుల స్కెచ్ల విడుదల నిర్ణయాన్ని ఎన్ఐఎ తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. ముగ్గురు వ్యక్తులు బాంబు పేలుడు జరిగిన స్థలంలో ఉన్నట్లు ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. దాంతో పోలీసులు వారి స్కెచ్లను రూపొందించారు. అయితే, వాటిని తిరిగి చూసుకునే పనిలో పడ్డారు.
ముగ్గురు వ్యక్తులు జెన్ కారులో వచ్చి, ఓ పాకెట్ను ఫ్లవర్ పాట్ల మధ్య విసిరేశాడని అంటున్నారు. అయితే, ఈ కేసులో పోలీసులు కచ్చితమైన పురోగతి సాధించలేదు. వారు ఎన్ఐఎ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఈ ఘటన వెనక ఆల్ - ఉమా ఉండవచ్చునని పోలీసులు అనుమానించారు. అయితే, దీని వెనక సంస్థలేవీ లేకపోవచ్చునని, వ్యక్తులే ఆ పనికి ఒడిగట్టి ఉండవచ్చుననే వాదన కూడా వినిపిస్తోంది.