జయ ఆరోగ్యం: బెంగళూరులో హై అలర్ట్ !
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించడంతో అల్లర్లు జరగడానికి అవకాశం ఉందనే అనుమానం రావడంతో బెంగళూరు నగరంలో తమిళ సోదరులు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లోకట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని బెంగళూరు నగర పోలీసు కమీషనర్ మేఘరిక్ ఆదేశాలు జారీ చేశారు.
బెంగళూరు నగరంలో దాదాపు 20 లక్షల మంది తమిళ సోదరులు నివాసం ఉంటున్నారు. వారిలో అన్నాడీఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు కొన్ని వేల మంది ఉన్నారు. జయలలిత ఆరోగ్యం విషమించిందని ఆదివారం రాత్రి విషయం తెలియడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందారు. ఇప్పటికే ప్రత్యేక పూజలు, హోమాలు మొదలు పెట్టారు.
బెంగళూరులో సోమవారం జయలలిత కటౌంట్లు, ఫ్లక్సీలు ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత చర్యగా నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. కావేరీ జలాల పంపిణి విషయంలో ఇటీవల బెంగళూరులో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన అనేక వాహనాలు ధ్వంసం అయ్యాయి.అలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.