భవనంపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య: వాట్సప్లో వీడియో
వివరాల్లోకి వెళితే.. రామమూర్తి నగర్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాజేష్ చౌదరి(27) ఓ ప్రముఖ ఐటి కంపెనీలో పని చేస్తున్నాడు. బెంగళూరులోని సింగసంద్రాలోని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒత్తిడి కారణంగానే రాజేష్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అతని బంధువులు, పోలీసులు చెబుతున్నారు. భవనంపై నుంచి దిగాలని అతని సహచరులు చేసిన అరుపులను పట్టించుకోకుండా దూకి ప్రాణాలను కోల్పోయాడు.
గురువారం ఉదయం 7.30గంటలకు కుడ్లు గేట్ సమీపంలో నివాసముంటున్న తన బంధువులు దగ్గరికి వెళ్లిన రాజేష్ తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు అలాంటి పిచ్చిపనులు చేయొద్దని వారించారు. అక్కడ్నుంచి బయటికి వచ్చిన రాజేష్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంపైకి వెళ్లాడు.
అక్కడ పని చేస్తున్న వారు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడేమోనని ఆందోళన చెంది.. అతడ్ని భవనం నుంచి దిగమని కోరారు. తన దగ్గరికి ఎవరైనా వస్తే భవనంపై నుంచి దూకేస్తానని వారిని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో భవన నిర్మాణ పనులు చూసుకుంటున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఆ భవనం వద్దకు చేరుకున్నారు.
రాజేష్ను రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భవనంపైకి ఎక్కారు. అయితే వారు చేరుకునే సమయానికే రాజేష్ భవనంపై నుంచి దూకేశాడు. తీవ్ర గాయాలపాలైన రాజేష్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే రాజేష్ మృతి చెందాడని వైద్యులు తేల్చారు.
మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. తన కుమారుడు రెండేళ్ల నుంచి ఒత్తిడిలో ఉంటున్నాడని, వైద్యుడికి చూపించుకోవాలని కోరితే అందుకు నిరాకరించాడని రాజేష్ తల్లిదండ్రులు తెలిపారు. బెంగళూరుకు వచ్చి ఏడాదిన్నర అయిందని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, వాట్సప్లో రాజేష్ మృతి వీడియోను పెట్టిన వారిని ట్రాక్ చేస్తున్నామని తెలిపారు.