మూడు ముక్కలుగా బెంగళూరు: పంతం నెగ్గించుకుంటున్న కాంగ్రెసు
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)ని మూడు ముక్కలు చెయ్యాలని ఒంటి కాలి మీద నిలబడిన కాంగ్రెస్ చివరికి పంతం నెగ్గించుకుంటున్నది. తమ పార్టీ శాసన సభ్యులకు విప్ జారీ చేసి సోమవారం ఒక్క రోజు అసెంబ్లి సమావేశానికి హాజరు అయ్యేలా చేసింది.
సోమవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లి సమావేశం ప్రారంభం అయ్యింది. తరువాత ఐటి, బీటి సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరం అభివృద్ది కావాలంటే మూడు భాగాలుగా విభజించాలని అధికారపార్టీ నాయకులు చెప్పారు. అందుకు ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్ శాసన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
బెంగళూరు నగరాన్ని మూడు ముక్కలు చెయ్యాలని ముందుగానే ప్రణాళిక సిద్దం చేసుకున్న కాంగ్రెస్ ఎట్టిపరిస్థితిల్లో వెనక్కు తగ్గరాదని నిర్ణయించుకుంది. ఇప్పటికే బెంగళూరును విభజించాలని గవర్నర్ కు పంపించిన నివేదికకు అమోదముద్ర వెయ్యకుండా ఆయన వెనక్కి తిప్పిపంపించారు.
బెంగళూరును విభజించరాదని సోమవారం బీజేపీ యువమోర్చ, పలు కన్నడ సంఘాలు ఆందోళన చేపట్టాయి. విధాన సౌధ ముట్టడికి ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. 198 మంది కార్పొరేటర్లు ఉన్న బీబీఎంపీ మిని అసెంబ్లి అయిపోందని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు.
మొత్తం మీద విభజించు, పాలించు అనే సాంప్రదాయం అనుసరిస్తున్న కాంగ్రెస్ బెంగళూరును మూడు ముక్కలు చెయ్యాలని చాల నెలల నుండి ప్రయత్నిస్తున్నది. సొంత పార్టీ శాసన సభ్యులు, ఎంపీలు, కార్పొరేటర్లు బెంగళూరును విభజించరాదని చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదు.