‘ఢిల్లీకి ఉగ్రముప్పు: వైమానిక దాడులకు అవకాశం’
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీపై ఉగ్రవాదులు వైమానిక దాడులు జరిపే అవకాశం ఉందని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. ఐఎస్ సహా పలు ఉగ్ర సంస్థల నుంచి ఢిల్లీకి ముప్పు ఉందని పేర్కొంది. ఢిల్లీలోని 15 కీలక ప్రాంతాలు ఉగ్రవాదుల లక్ష్యంగా ఉన్నాయని భద్రతా ఏజెన్సీల నివేదికల్లో వెల్లడైందని చెప్పింది.
ఉగ్రవాద లక్ష్యాల్లో ప్రధాని నివాసం, రాష్ట్రపతి భవన్, ఉపరాష్ట్రపతి నివాసం, హోం మంత్రి నివాసం, రాజ్పథ్, ఇండియా గేట్, సీజీఓ కాంప్లెక్స్, సీబీఐ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ ముఖ్య కార్యాలయాలు సైతం ఉన్నాయని తెలిపింది. డ్రోన్లు, మానవ రహిత విమానాల ద్వారా వారు దాడులకు దిగే అవకాశాలు ఉన్నట్లు తెలిసిందని చెప్పింది.
ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు ఇచ్చిన హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ హెచ్చరిక మెయిల్ని తీర ప్రాంత భద్రత దళాలు, నేవీ, కోస్ట్ గార్డులకు పంపింది. దీంతో తమిళనాడులోని రామనాథపురం జిల్లా సముద్ర తీరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
రామేశ్వరం తీరం నుంచి ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమయిన నేపథ్యంలో ఆ ప్రాంతమంతా భద్రతాదళాలు పహారా కాస్తున్నాయి. చెన్నై నుంచి పెద్ద యుద్ధ నౌకను నేవీ దళాలు రామేశ్వరం తీరానికి పంపించాయి. మరికొన్ని బోట్లలో భద్రతా దళాలు సముద్రంలో గస్తీ చేపట్టాయి.