బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది?
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీకి, మరోవైపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్కు ప్రతిష్టకు సంబంధించినవి. గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ హవాతో బిజెపి క్లీన్ స్వీప్ చేసింది. బీహార్లోను బిజెపి సత్తా చాటింది.
ఆ తర్వాత వచ్చిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తుడిచి పెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికలు ప్రధాని మోడీ ప్రతిష్టకు కొలమానం. ఆయన హవా ఉందా? లేదా? ఈ ఎన్నికల్లో తేలిపోనుందని చాలామంది భావిస్తున్నారు.
మరోవైపు, బిజెపితో తెగతెంపులు చేసుకోవడం, అవినీతి మకిలి అంటిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్తో జత కట్టిన నేపథ్యంలో నితీష్ కుమార్కు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవే. ప్రధాని పదవిని ఆశించిన నితీష్.. అది మోడీకి దక్కడంతో బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు.
దీంతో, ఈ ఎన్నికలు.. ప్రధానంగా మోడీ వర్సెస్ నితీష్ కుమార్విగా భావిస్తున్నారు. బిజెపి గెలిస్తే నితీష్కు గట్టి దెబ్బే. అయితే లాలు ప్రసాద్, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం వల్ల ఆయనకు నష్టం జరుగుతుందని అంటున్నారు.
మరోవైపు, బిజెపి ఓడిపోయినా... మూడు పార్టీలు కలిసి బిజెపిని దెబ్బతీశాయని చెప్పేందుకు ఆస్కారం ఉంటుంది. ఎన్నికల తర్వాత ఎవరు ఏం చెప్పినా... పార్టీల విషయాన్ని పక్కన పెడితే... ప్రధాని మోడీకి, నితీష్ కుమార్కు మాత్రం ఇవి పరువుతో కూడినవి అని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో.. పలు సర్వేలు బీహార్ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయమై లెక్కలు వేస్తున్నాయి. జీ న్యూస్ - జనతా కా మూడ్ - బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేకు 162, జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమికి 51 స్థానాలు. జీ న్యూస్ శుక్రవారం నాడు సర్వే ఫలితాలు వెల్లడించింది.
5-8 తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. 243 సీట్ల బీహార్ అసెంబ్లీలో కనీస మెజార్టీకి 122 స్థానాలు అవసరం కాగా.. ఎన్డీయే 162 సీట్లతో మూడింట రెండొంతుల స్థానాలు దక్కించుకుంటుందని తేలిందని తెలిపింది.
ఎన్డీయేకు 54.8 శాతం ఓట్లు, లౌకిక కూటమికి 40.2 శాతం ఓట్లు, ఇతరులకు 6 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. యాదవులు ఎక్కువగా లౌకిక కూటమికి మద్దతు పలకగా, మిగతా సామాజిక వర్గం వారు ఎన్డీయేకు ఎక్కువగా మద్దతు పలికారు. ముస్లీముల్లో 58 శాతం లౌకిక కూటమికి, 35 శాతం బిజెపికి మద్దతు పలికినట్లు సర్వేలో వెల్లడైంది. అయితే, సర్వేల్లో ఎప్పటికప్పుడు అభిప్రాయం మారుతోంది.
రెండు రోజుల క్రితం ఏ సర్వే ఏం చెబుతోంది?
సీఎన్ఎన్ - ఐబీఎన్ - యాక్సిస్: బిజెపి కూటమి 95 సీట్లు, 38 శాతం ఓట్లు, లౌకిక కూటమికి 137 సీట్లు, 46 శాతం ఓట్లు.
ఐటీజీ - సిసెరో: బిజెపి కూటమి 111 సీట్లు, 39 శాతం ఓట్లు, లౌకిక కూటమికి 122 సీట్లు, 41 శాతం ఓట్లు.
సీ ఓటర్: బిజెపి కూటమి 119 సీట్లు, 43 శాతం ఓట్లు, లౌకిక కూటమికి 116 సీట్లు, 41 శాతం ఓట్లు.
జీ న్యూస్: బిజెపి కూటమి 147 సీట్లు, 53.80 శాతం ఓట్లు, లౌకిక కూటమికి 64 సీట్లు, 40.2 శాతం ఓట్లు.
టైమ్స్ నౌ - సీ ఓటర్: బిజెపి కూటమి 117 సీట్లు, 43 శాతం ఓట్లు, లౌకిక కూటమికి 112 సీట్లు, 42 శాతం ఓట్లు.
ఏబీపీ నీల్సన్: బిజెపి కూటమి 128 సీట్లు, 42 శాతం ఓట్లు, లౌకిక కూటమికి 112 సీట్లు, 40 శాతం ఓట్లు.
ఇండియా టూడే-సిసెరో: బిజెపి కూటమి 125 సీట్లు, 42 శాతం ఓట్లు, లౌకిక కూటమికి 106 సీట్లు, 40 శాతం ఓట్లు.
న్యూస్ నేషన్: బిజెపి కూటమి 111 - 115 సీట్లు, 42 శాతం ఓట్లు, లౌకిక కూటమికి 125-129 సీట్లు, 45 శాతం ఓట్లు.