ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడని దళిత ఎస్ఐని కాల్చేసిన సహోద్యోగి
పాట్నా: తన సహోద్యోగిని వాహనం ఫ్రంట్ సీట్లో కూర్చున్నందుకు సబ్ ఇన్స్పెక్టర్ కాల్చి చంపాడు. దళితుడై ఉండి ఫ్రంట్ సీట్లో కూర్చునందుకు అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. ఆ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని రాష్టర్ మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సి) ఆదేశించింది.
సహోద్యోగిని చంపిన ఎస్ఐ అజయ్ కుమార్ సింగ్ యాదవ్ ఆస్తులను జప్తు చేయాలని కమిషన్ శరన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ను, పోలీసు సూపరింటిండెంట్ను ఆదేశించారు ఈ కేసు దర్యాప్తును వచ్చే ఏడాది 31వ తేదీలోగా పూర్తి చేయాలని కూడా ఆదేశించింది.
మరణించిన ఎస్ఐ కృష్ణ బైతా కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కమిషన్ ఉత్తర బీహార్లోని శరన్ జిల్లా మెజిస్ట్రేట్ను రాష్ట్ర హోం శాఖను ఆదేశించింది. ఈ సంఘటనపై బీహార్లోని చంపారన్ జిల్లా తుర్కవాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని రజక్ గ్రామానికి చెందిన సురేంద్ర కుమార్ రజక్ ఫిర్యాదు చేశారు.
బొలేరో ఫ్రంట్ సీట్లో కూర్చున్నందుకు తన తండ్రి, శరన్లోని బనియాపూర్ పోలీసు స్టేషన్ ఎస్ఐని 2013 సెప్టెంబర్లో యాదవ్ చంపేశాడని ఆయన ఫిర్యాదు చేశారు. సర్వీస్ రివాల్వర్తో కాల్చి చంపాడని ఆయన ఆరోపించారు. తాము 2013 సెప్టెంబర్లో ఫిర్యాదు చేసినప్పటికీ యాదవ్ను అరెస్టు చేయలేదని ఆయన ఆరోపించారు.