అంతా అమిత్ షా కనుసన్నల్లోనే: చక్రం తిప్పుతూ...
ఉత్తరప్రదేశ్ సహా మూడు రాష్ర్టాల్లో నూతన ముఖ్యమంత్రుల ఎంపిక బాధ్యతను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు అప్పగిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు తీర్మానించింది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సహా మూడు రాష్ర్టాల్లో నూతన ముఖ్యమంత్రుల ఎంపిక బాధ్యతను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు అప్పగిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు తీర్మానించింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎమ్మెల్యేలతో సంప్రదింపుల కోసం పరిశీలకులను కూడా పంపాలని నిర్ణయించింది.
ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, జేపీ నడ్డా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 16వ తేదీన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరన్న విషయం నిర్ణయిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తర్వాత మీడియాకు తెలిపారు.
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు ప్రధాన పోటీదారులుగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఎన్నికలకు ముందు యూపీ రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్లబోనని కేంద్రమంత్రి రాజ్నాథ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే గోవా సీఎంగా కేంద్ర మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ మ్రుదులా సిన్హా ఆహ్వానించిన సంగతి విదితమే.
బీసీ ఖండూరీ సహా బరిలో మరి కొందరు
యూపీ పొరుగు రాష్ట్రం ఉత్తరాఖండ్లో సీఎం పదవికి సత్పాల్ మహారాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. మాజీ సీఎం బీసీ ఖండూరీ పేరునూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు పరిగణనలోకి తీసుకున్నట్లు వినికిడి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీ సాధించిన యూపీ, ఉత్తరాఖండ్లలో ఎవరిని సీఎంగా నియమించాలన్న అంశంపై చర్చించారని తెలుస్తున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించడంలో వెనుకబడిన గోవా, మణిపూర్లలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. మూడు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలతో సంప్రదింపులకు పంపే పార్టీ పరిశీలకులను కూడా ప్రకటించనున్నది. గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అన్ని చర్యలు తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నది.
వెంకయ్య, భూపేంద్రయాదవ్
ఉత్తర ప్రదేశ్ సీఎం ఎంపిక బాధ్యతను బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుకు అప్పగించారు. ఈయన యూపీలోని ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎవరిని సీఎంగా ఎంపిక చేయాలన్నదానిపై నివేదిక ఇస్తారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తుది నిర్ణయం తీసుకుంటారు. కేవలం యూపీకే కాకుండా ఉత్తరాఖండ్, మణిపూర్లకు కూడా సీఎంల ఎంపికపై అమిత్ షానే తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు.
పరిశీలకుల నివేదికల ఆధారంగా అమిత్ షా తుది నిర్ణయం
పార్టీలో సీనియర్ నేతలను ఈ రాష్ర్టాలకు పరిశీలకులుగా నియమించామని.. వీరు అక్కడకు వెళ్లి.. ఎమ్మెల్యేలతో మాట్లాడి సీఎంగా ఎవరిని నియమించొచ్చన్న అంశంపై నివేదిక ఇస్తారని కేంద్రమంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఈ మేరకు అమిత్షాకు అధికారాన్ని కట్టబెడుతూ పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుందని చెప్పారు. సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, భూపేంద్రయాదవ్ ఉత్తరప్రదేశ్కి పరిశీలకులుగా ఉంటారని తెలిపారు.
మణిపూర్కు పీయూష్ గోయల్
ఉత్తరాఖండ్కు నరేంద్ర తోమర్, సరోజ్ పాండేలను పరిశీలకులుగా నియమించారు. మణిపూర్కి పీయూష్ గోయల్, వినయ్ సహస్రబుద్ధే ఉంటారని తెలిపారు. మరోవైపు యూపీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 16వ తేదీన జరగనున్నది. అదే రోజు ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న విషయం ఖరారు కానున్నది.
32కు చేరిన బీజేపీ బలం?
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోనూ బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీకి 28, బీజేపీకి 21 స్థానాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. గోవాతోపాటు మణిపూర్లోనూ ప్రభుత్వ ఏర్పాటు కోసం మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నది. ఎన్డీయే మిత్ర పక్షాలు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ లకు చెందిన నలుగురేసి సభ్యులు, లోక్ జనశక్తి పార్టీ, త్రుణమూల్ కాంగ్రెస్ లకు చెందిన ఒక్కో సభ్యుడు, మరో స్వతంత్ర సభ్యుడు బీజేపీకి బాసటగా నిలిచారు. దీంతో 60 మంది ఎమ్మెల్యేలు గల మణిపూర్లో బీజేపీకి 32 మంది సభ్యుల బలం చేకూరింది. సభ్యుల మద్దతు కూడగట్టే విషయమై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, హర్యానా మంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు ఆదివారం అంతా బిజీబిజీగా గడిపారు.