'మహా' సెంటిమెంట్: మళ్లీ నిలిపిన అమిత్ షా వ్యూహం
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ 122 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం వెనుక ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారంతో పాటు.. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వ్యూహం పని చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో షా వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. రాష్ట్రానికి చెందిన సీనియర్ నతే గోపినాథ్ ముండే అకస్మిక మరణం తర్వాత బీజేపీకి రాష్ట్రమంతటికీ తెలిసిన, జనాల్లో నుండి వచ్చిన నేతలు లేకుండా పోయారనే చెప్పవచ్చు.
ఈ ఎన్నికల్లో పార్టీకి అదే పెద్ద సమస్యగా మారింది. దానికి తోడు ఇతర ప్రధాన పార్టీలన్నీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఎవరో ఒకరిని ప్రచారంలోకి తెచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుండి పృథ్వీరాజ్ చవాన్, ఎన్సీపీసి అజిత్ పవార్, శివసేనకు ఉద్ధవ్ థాకరే సీఎం అభ్యర్థులుగా ఉన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీకి సీఎం అభ్యర్థి పెద్ద సమస్యగా మారింది. దీనిని అధిగమించేందుకు అమిత్ వినూత్న వ్యూహాన్ని అవలంభించారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో బీజేపీ అధికారికంగా మౌనం వహించింది. అయితే, ఆయా ప్రాంతాల ముఖ్య నేతలను సీఎం అభ్యర్థులుగా ప్రచారం చేసుకోవడానికి అనుమతించారు. విదర్భ అంతటా పార్టీ ప్రచారంలో ఎక్కడ చూసినా ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ కనిపించారు. విదర్భలో పోస్టర్లలో మోడీ పక్కన కూడా ఆయనే ఉన్నారు. మరట్వాడా, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో మోడీతో పాటు పంకజ ముండే ఫోటోలు కనిపించాయి.
ఉత్తర మహారాష్ట్రలో, ఏక్నాథ్ ఖడ్సే, ముంబయి - కొంకణ్ ప్రాంతంలో వినోద్ తాప్డే ఫోటోలు కనిపించాయి. రాష్ట్రంలో ఉప ప్రాంతీయ సెంటిమెంటు ద్వారా బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుందని భావిస్తున్నారు. అదే సమయంలో పలువురు ముఖ్య నేతలు ముఖ్యమంత్రి అభ్యర్థిత్ం విషయంలో తమ అనురక్తిని చాటుకునేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఎవరికి వారు తాము ముఖ్యమంత్రి రేసులో ఉన్నామని చెప్పుకొచ్చురు.
ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం పైన మౌనం పాటించారు. కేవలం మహారాష్ట్రలో నెగ్గేందుకే అమిత్ షా ఈ వ్యూహం రచించారని అంటున్నారు. కానీ, ఎవరికీ సీఎం అయ్యే ఆశలు లేవని అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆయా నేతలు ఇచ్చిన ప్రకటనలే అందుకు నిదర్శనమంటున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్, పంకజ ముండే తదితరులు ఎవరికి వారు తాము సీఎం రేసులో లేమని ఆదివారం ఫలితాల అనంతరం చెప్పడం గమనార్హం.
ముఖ్యమంత్రి విషయమై తుది నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకుంటారని అమిత్ షా వారికి ముందే చెప్పారని తెలుస్తోంది. అయితే ఉప ప్రాంతాల సెంటిమెంటును దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతం వరకు సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసుకునే అవకాశం కల్పించారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోను అమిత్ షా వ్యూహం ఫలించి 73 లోకసభ స్థానాలను బీజేపీ గెలుచుకున్న విషయం తెలిసిందే.