ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ, చైనా పార్టీ రికార్డ్ బద్దలు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రపంచ రికార్డు స్పృష్టించింది. 8.80 కోట్ల మందిని పార్టీ సభ్యులుగా చేర్పించి ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ పార్టీగా అవతరించింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి 8.60 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు చైనా రిపబ్లిక్ పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా గుర్తింపు పొందింది.
ఇప్పడు ఆ రికార్డును బీజేపీ బద్దలు కొట్టింది. గత ఐదు నెలల నుండి బీజేపీ దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. 2014 నవంబర్ 1వ తేదిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆన్లైన్ ద్వారా మొదటి సభ్యత్వం తీసుకున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రెండవ సభ్యత్వం తీసుకున్నారు.
మార్చి 29 ఆదివారం నాటికి దేశ వ్యాప్తంగా 8.80 కోట్ల మంది సభ్యత్వం తీసుకున్నారని ఢిల్లీలోని బీజేపీ కార్యాలయ వర్గాలు ఆదివారం తెలిపాయి. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందిని పార్టీ సభ్యులుగా చేర్పించాలని బీజేపీ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏప్రిల్ 3, 4వ తేదీలలో బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, ఎల్కే అద్వాని, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ నాయకులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా బీజేపీలో ఎంతమంది సభ్యత్వం తీసుకున్నారనే విషయాన్ని జాతీయ అధ్యక్షులు అమిత్ షా స్వయంగా వెళ్లడించనున్నారు.